New guidelines for Minimum Support Price: రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించడంతో పాటుగా.. అందులో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ‘పీఎం-ఆశా’ పథకం కింద ధర మద్దతు పథకం మరియు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం అమలుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ నెల 18న జారీ చేసిన ఈ ఉత్తర్వులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే అమలులోకి వచ్చేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు పంపింది. నిజమైన రైతులకే మద్దతు ధర ప్రయోజనం దక్కేలా చూడటమే లక్ష్యంగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మధ్యవర్తుల జోక్యాన్ని తగ్గించడంతో పాటుగా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా ఉంచడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం.
దళారుల దుర్వినియోగంపై కఠిన చర్యలు: బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇచ్చి పంటలను కొనుగోలు చేసే విధానాన్ని దళారులతో పాటుగా ప్రైవేటు వ్యాపారులు దుర్వినియోగం చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. వరి, పత్తి, కందులు, మొక్కజొన్న, పెసర, జొన్నలు, మినుములు వంటి అనేక పంటలను మార్కెట్ ధరతో సంబంధం లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అయితే దళారులు పంట నాణ్యత లేదనే సాకుతో రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి,, తిరిగి అదే పంటను మార్క్ఫెడ్, నాఫెడ్, ఎన్సీసీఎఫ్, సీసీఐ వంటి ప్రభుత్వ సంస్థలతో కుమ్మక్కై రైతుల పేరిట మద్దతు ధరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో పత్తి కొనుగోళ్లు, జొన్నల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు రుజువైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.
తప్పనిసరిగా రైతుల రిజిస్ట్రేషన్ : కొత్త మార్గదర్శకాల ప్రకారం కేవలం పంట పండించిన రైతు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను విక్రయించేందుకు వీలు కల్పించారు. ఇందుకోసం రైతులకు కొన్ని నిబంధనలు విధించారు.
- పోర్టల్లో రిజిస్ట్రేషన్: ధర మద్దతు పథకం ప్రత్యేక పోర్టల్లో రైతులు తప్పనిసరిగా రిజిస్టర్ కావాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద కూడా రైతు డేటాను కేంద్రం సేకరిస్తుంది.
- పంట వివరాల ధృవీకరణ: రాష్ట్ర పోర్టల్లో రిజిస్టర్ అయిన రైతుల పంట వివరాలను అగ్రి–స్టాక్ ఇంటిగ్రేషన్ ద్వారా ధ్రువీకరించాలి.
- డేటా అనుసంధానం: రైతు ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకం మరియు క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగా వ్యవసాయ శాఖ నుంచి పంట వివరాలను సేకరించి, కొనుగోలు సంస్థలైన నాఫెడ్, ఎన్సీసీఎఫ్ వంటి కేంద్ర నోడల్ ఏజెన్సీలతో ఆ డేటాను అనుసంధానం చేయాలి.
- ఆటో వెరిఫికేషన్: డిజిటల్ క్రాప్ సర్వే, అగ్రి-స్టాక్ డేటాతో పంట వివరాల ఆటో వెరిఫికేషన్ తప్పనిసరి.
- బయోమెట్రిక్ లేదా ముఖ గుర్తింపు: కొనుగోలు కేంద్రాల వద్ద ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ లేదా మొబైల్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు తప్పనిసరి. ఓటీపీ ద్వారా ధ్రువీకరణకు అనుమతి లేదు, తద్వారా దళారులు బల్క్గా పంటలను విక్రయించే అవకాశం ఉండదు.
- ప్రతినిధికి అవకాశం: రైతు నేరుగా రాని పక్షంలో, తన ఆధార్ నంబర్తో గరిష్టంగా ముగ్గురికి ఆథరైజేషన్ ఇచ్చి పంటల విక్రయానికి పంపవచ్చు. అయితే, చెల్లింపు మాత్రం నేరుగా రైతు (యజమాని) బ్యాంక్ ఖాతాకు మాత్రమే వెళ్తుంది.
- డీబీటీ ద్వారా చెల్లింపు: రైతులకు చెల్లింపులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా ఆధార్ వెరిఫైడ్ ఖాతాల్లోనే జరుగుతాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ఈ నెల 30 లోపు కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది.
ఈ కఠిన నిబంధనల ద్వారా కనీస మద్దతు ధర ప్రయోజనాలు నిజమైన రైతులకు చేరేలా మరియు కొనుగోలు ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.


