సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి బెయిల్ వచ్చినా జైలు నుండి విడుదల ఇంకా జాప్యం అవుతోంది. వైసీపీ హయాంలో ఏపీఎఫ్టీవీడీసీ ఛైర్మన్గా పనిచేసిన పోసాని, కొన్ని సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. వారి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించిన వ్యవహారంలో పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.
పిటీ వారెంట్లపై పలు పీఎస్లు, కోర్టులు, జైళ్లను తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. సీఐడీ కేసులో బెయిల్ రావడంతో కొంత మార్గం సుగమం అయినా, పోసాని విడుదల ఆలస్యం అవుతోంది. గుంటూరు సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో పోసానికి బెయిల్ వచ్చినా విడుదలకు మోక్షం ఇంకా కలగడం లేదు. బెయిల్ పేపర్లు రావడం ఆలస్యం కావడంతో పోసాని జైలు నుండి విడుదల కాలేకపోయారు. శనివారం విడుదల కావచ్చని పోసాని న్యాయవాదులు అంటున్నారు.
మరోపక్క పోసాని సన్నిహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా పీటీ వారెంట్తో ఏ స్టేషన్ పోలీసులు వస్తారో తెలియదని చెబుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి కేసులూ లేవని న్యాయవాదులు చెబుతున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోసానిపై మొత్తం 18 కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో పోసానికి బెయిల్ మంజూరు అయినా.. మరికొన్ని కేసుల్లో రిమాండ్లో ఉండడం, అన్ని కేసుల్లో బెయిల్ దొరకకపోవడం, మరికొన్ని కేసుల్లో 35 (3) Bns ఫాలో అవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పోసాని జైల్లోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని అనుకున్నట్టు జరిగితే శనివారం గుంటూరు జైలు నుండి పోసాని కృష్ణమురళి విడుదల అవుతారని చెబుతున్నారు.