హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ దారిలో వెళ్లే వాహనాలకు టోల్ ఛార్జీలు(Toll Charges) తగ్గిస్తూ ఎన్హెచ్ఏఐ(NHIA) నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రాబోతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ 2025 నుంచి మార్చి 31వ తేదీ 2026 వరకు కొత్త ధరలు అమలులో ఉంటాయి. ఈ హైవేపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్గేట్లు ఉన్నాయి.
పతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజా దగ్గర కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి రూ.15, ఇరు వైపులా కలిపి రూ.30, లైట్ వెయిట్ వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40, బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించినట్లు అధికారులు ప్రకటించారు. ఇక చిల్లకల్లు టోల్ప్లాజా దగ్గర అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే రేట్లు తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ ఛార్జీలో 25 శాతం మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.