Wednesday, June 25, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Jagan: సింగయ్య మృతి కేసు.. హైకోర్టును ఆశ్రయించిన జగన్

YS Jagan: సింగయ్య మృతి కేసు.. హైకోర్టును ఆశ్రయించిన జగన్

YS Jagan files quash petition: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇటీవల చేపట్టిన పల్నాడు జిల్లా పర్యటన తీవ్ర విషాదంగా మిగిలింది. ఆయన పర్యటన సందర్బంగా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ముందుగా జగన్ కాన్వాయ్ లోకి కారు చక్రాల కింద పడి సింగయ్య అనే వృద్ధుడు మరణించాడు. అనంతరం బైక్ మీద నుంచి పడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

అయితే సింగయ్య.. జగన్ కారు కింద పడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో జగన్ తీరుపై కూటమి ప్రభుత్వం, విపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఈ ఘటనకు కారణమైన కారు డ్రైవర్ ఏఆర్ కానిస్టేబుల్ రమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే జగన్ తో పాటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు విడదల రజినీ, పేర్ని నాని, జగన్ పీఏలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో జగన్ ను ఏ2 నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలో ప్రమాదానికి కారణమైన జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా సీజ్ చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ జగన్ తో పాటు ఇతర వైసీపీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటిన్ వేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ చేయాలని అభ్యర్థించారు. అయితే న్యాయస్థానం మాత్రం అత్యవసరంగా విచారణ చేయలేమని.. రేపు విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

కాగా సింగయ్య మృతికి సంబంధించి కేసు నమోదుకావడంపై జగన్ తీవ్రంగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ విమర్శించారు. జడ్ ప్లస్ భద్రత కలిగిన మాజీ సీఎం పర్యటనకు సరైన భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని గుర్తుచేశారు.

ఇదిలా ఉంటే జగన్‌కు జడ్ ప్లస్ భద్రత గురించి దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా జగన్ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చిందని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. అనంతరం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ విచారణను జులై 15కు న్యాయమూర్తి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News