Gold, silver prices: కళ్లెం లేని గుర్రంలా బంగారం ధర దూసుకుపోతుంది. పసిడి ధర ఏకంగా 10 గ్రాములు రూ. 1.20 లక్షల మార్కుకు చేరుకుంది. గత కొద్ది నెలల్లో ఊహించని పెరుగుదల నమోదు కావడంతో ఆభరణాలు కొనాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు బంగారం అందని ద్రాక్షలా మారుతోంది. పసిడి ధరలను గమనిస్తే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సాగుతోంది. జనవరి నెలలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 80 వేలు పలకగా జూలై నాటికి అది రూ. లక్షకు చేరుకుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే అత్యంత వేగంగా ధర పెరిగింది. ఈ రెండు నెలల్లో రోజుకు రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు పెరుగుతూ, మొత్తంగా రూ. 20 వేలు అధికమైంది.
బంగారం బాటలేనే వెండి: పసిడి బాటలోనే వెండి ధరలు కూడా విర్రవీగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కేజీ వెండి ధర రూ. 92 వేలు ఉండగా.. నేడు అది ఏకంగా రూ. 1.50 లక్షలకు చేరింది. త్వరలోనే కేజీ వెండి ధర రూ. 2 లక్షలకు చేరుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు ఇవే: బులియన్ మార్కెట్ విశ్లేషకులు బంగారం, వెండి ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని పేర్కొంటున్నారు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయిల్-గాజా మధ్య జరుగుతున్న యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితిని పెంచాయి. ఇవేకాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలు సైతం పసిడి ధరల పెరుగుదలకు దోహదపడ్డాయి.
సురక్షిత పెట్టుబడి: అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆశ్రయంగా భావించి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుండటంతో డిమాండ్ పెరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదలకు ముఖ్య కారణం.
లాభాల పంట పండిస్తున్న మదుపరులు: ధరలు పెరుగుతాయనే ముందుచూపుతో బంగారంపై పెట్టుబడులు పెట్టిన బడా మదుపరులు లాభాలు కళ్లజూస్తున్నారు. వడ్డీ వ్యాపారులు సైతం 100 గ్రాముల బిస్కెట్లు, 50 నుంచి 70 కాసుల వడ్డాణం వంటి వస్తువుల రూపంలో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వీరు తమ పెట్టుబడులపై 30 నుంచి 40 శాతం వరకు లాభాలు ఆర్జించినట్లు సమాచారం.


