BigG Boss Fraud: ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎంతో ప్రాచుర్యం పొందిన షో బిగ్ బాస్. ఇప్పటికే బిగ్ బాస్ లో చాలా సీజన్లు అన్ని భాషాల్లో రన్ అవుతున్నాయి. ఒక్కొ సీజన్ ని ఒక్కో రీతిలో మేకర్స్ రెడీ చేస్తున్నారు. ఒకసారి సెలబ్రిటీలు వస్తే..మరోసారి సామాన్యులు కూడా సీజన్ లో ఎంటర్ అవుతున్నారు. బిగ్ బాస్ మేకర్స్ షోలో పాల్గొనే ఇంట్రెస్ట్ ఉంటే సామాన్యులకు ఆహ్వానం అని చేసిన ఓ అనౌన్స్మెంట్ కొందర్ని మోసపోయేలా చేస్తుంది.
బిగ్బాస్ రియాలిటీ షో..
అసలేం జరిగిందంటే..భోపాల్లో ఓ ప్రముఖ వైద్యుడికి బిగ్బాస్ రియాలిటీ షోలో ప్రవేశం కల్పిస్తానని చెప్పి, భారీ మొత్తంలో డబ్బు తీసుకున్న మోసం తాజాగా బయటపడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధానిలో సంచలనం రేపింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈవెంట్ డైరెక్టర్గా..
భోపాల్కు చెందిన డాక్టర్ అభినిత్ గుప్తా చర్మ వ్యాధుల నిపుణుడు. ఆయన అక్కడే ‘పాయిజన్ స్కిన్ క్లినిక్’ అనే వైద్య కేంద్రం నిర్వహిస్తున్నారు. 2022లో కరణ్ సింగ్ అనే వ్యక్తి ఆయనను కలిశాడు. తనను ఈవెంట్ డైరెక్టర్గా పరిచయం చేసుకున్న కరణ్, టెలివిజన్ రంగంలో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలతో తనకు దగ్గరి పరిచయాలు ఉన్నాయని చెప్పాడు.
10 లక్షల రూపాయలు..
డాక్టర్ గుప్తాకు బిగ్బాస్ షోలో కంటెస్టెంట్గా అవకాశం కల్పించగలనని నమ్మబలికాడు. ఆ ప్రోగ్రాంలో పాల్గొనడం తన చేతుల్లోనే ఉందని, కొన్ని ప్రత్యేక మార్గాల ద్వారా ఆయన పేరు ఫైనల్ జాబితాలో చేర్పించగలనని హామీ ఇచ్చాడు. ఈ మాటలు విని డాక్టర్ గుప్తా నమ్మకం ఏర్పరుచుకొని, కరణ్ సింగ్కు మొత్తం 10 లక్షల రూపాయలు ఇచ్చారు.
మొదట్లో అన్నీ సవ్యంగా ఉన్నట్లు కనిపించాయి. కానీ బిగ్బాస్ కంటెస్టెంట్ల అధికారిక జాబితా వెలువడినప్పుడు, అందులో డాక్టర్ గుప్తా పేరు లేకపోవడం గమనించారు. ఈ విషయంపై ఆయన కరణ్ను ప్రశ్నించగా, వెంటనే అవకాశం రాకపోయినా ‘బ్యాక్డోర్ పద్ధతి’ ద్వారా చివరి క్షణంలో చేర్చుతామని సమాధానం ఇచ్చాడు.
రోజులు గడుస్తున్నా ఎటువంటి సమాచారం రాకపోవడంతో, డాక్టర్ గుప్తా తన డబ్బు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేశారు. అయితే కరణ్ సింగ్ అప్పుడు నుంచి ఫోన్ కాల్స్కు స్పందించడం మానేశాడు. కొద్దిరోజులకు ఫోన్ స్విచ్చాఫ్ చేసి కనబడకుండా పోయాడు.
మరింత కాలం వేచి చూసిన డాక్టర్ గుప్తా చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భోపాల్ పోలీసులు మోసం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కరణ్ సింగ్ను అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని సమాచారం.


