యువ హీరో నిఖిల్(Nikhil) నటిస్తున్న ‘ది ఇండియా హౌస్’ సినిమా చిత్రీకరణలో ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. శంషాబాద్ సమీపంలో వేసిన భారీ సెట్లో బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై తాజాగా నిఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
“ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించే ప్రయత్నంలో కొన్నిసార్లు రిస్క్లు తప్పవు. అలాంటి సమయంలోనే ఈ ఘటన జరిగింది. మా సిబ్బంది తీసుకున్న తక్షణ జాగ్రత్తల వల్ల పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. కానీ దురదృష్టవశాత్తూ కొన్ని ఖరీదైన పరికరాలను కోల్పోయాం. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, అందరం సురక్షితంగా ఉన్నాం” అని తెలిపారు.
శంషాబాద్ సమీపంలో ‘ది ఇండియా హౌస్’ సినిమా కోసం ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో సముద్రపు సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సమయంలో అక్కడ ఏర్పాటుచేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు సెట్లోకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో పలువురు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే నీటి ప్రవాహానికి సెట్లోని విలువైన కెమెరా పరికరాలు, ఇతర సామగ్రి తడిచిపోయాయి.
ఈ సినిమాలో నిఖిల్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 1900 కాలం నాటి సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సొంత బ్యానర్ మీద ఈ మూవీ తెరకెక్కుతుండటం విశేషం. ఇక ఈ చిత్రానికి కొత్త దర్శకడు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాతో పాటు స్వయంభు అనే ఫాంటసీ మూవీలోనూ నిఖిల్ నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.
Nikhil: దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం జరగలేదు.. నిఖిల్ పోస్ట్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES