SSMB 29: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా అంటేనే గ్యారెంటీగా బ్లాక్ బస్టర్. అది కూడా పాన్ ఇండియా రేంజ్లో. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఆయన రేంజ్ ప్రపంచ దేశాలకి చేరింది. రాజమౌళి తీసే ఒక్కో ప్రాజెక్ట్, ఇండియన్ సినిమా స్థాయిని విజువల్ గా ఒక ట్రెండ్ సెట్టర్ అని ప్రముఖులందరూ ప్రశంసించారు. బాహుబలి ఫ్రాంచైజ్తో ఇండియన్ సినిమాకు ఒక పాన్ ఇండియా స్థాయి దక్కింది అంటే అది కేవలం రాజమౌళి వల్లే. ఆ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్కు దగ్గరయ్యారు జక్కన్న.
ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న మూవీ కోసం కొత్త ప్రయోగాన్ని చేస్తున్నారు. ఇప్పటి వరకు జక్కన్న ఫాలో అయ్యే ఫార్ములాలను పక్కనపెట్టి, పూర్తి స్థాయిలో కొత్తరకం స్ట్రాటజీతో వెళుతున్నారు. బాహుబలి రెండు భాగాలు తీసిన సమయంలో ఎక్కువ భాగం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ మీదే షూటింగ్ జరిపారు. ఆ తర్వాత ఎన్టీఆర్, చరణ్లతో చేసిన ఆర్ఆర్ఆర్ కూడా ఎక్కువ భాగం గ్రాఫిక్స్తో సెట్స్లోనే షూటింగ్ జరిపారు.
అయితే, మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం మూడు రకాల ప్లానింగ్ను కలిపి షూటింగ్ చేయబోతున్నారని తాజా సమాచారం. ఎప్పటిలాగే.. కొన్ని సీన్స్ కోసం భారీ సెట్స్ అలాగే, రియల్ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నారు. ఈ విషయం ఒడిషా షెడ్యూల్ తో అర్థమైంది. ఇక వీఎఫ్ఎక్స్ ఖచ్చితంగా ఎంతో గ్రాండియర్గా ఉంటుంది. ఈ మూడింటినీ సమానంగా రాజమౌళి మహేశ్ సినిమాలో చూపించబోతున్నారు. రాజమౌళి తన ప్రతీ సినిమాకి కొత్తగా చాలా విషయాలను పరిచయం చేస్తుంటారు. అలాగే, మహేశ్ సినిమాకి ఇంకా చెప్పాలంటే ఆయనకీ ఇది ఓ కొత్త ప్రయాణం..ప్రయోగం అంటున్నారు.
ఇక ఇప్పటికే రాజమౌళి-మహేశ్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ను హైదరాబాద్లో ఆ తర్వాత కొన్ని రోజులు ఒడిషాలో పూర్తి చేశారు. ప్రస్తుతానికి కొంత టాకీ పార్ట్ హైదరాబాద్లోనే షూట్ చేయనున్నారు. దీనికొసం భారీ సెట్ కూడా వేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. 50 కోట్లతో కళాత్మకంగా నిర్మిస్తున్న ప్రాచీన కాశి నగరం సెట్ అని చెప్పుకుంటున్నారు. ఈ సెట్లో హీరో పాత్రకు సంబంధించిన ముఖ్యభాగం చిత్రీకరించబోతున్నారు. ఆ తర్వాత ఆఫ్రికాలోని కెన్యాలో ఓ కీలక షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి ఈ సినిమా నుంచి ఎలాంటి సమాచారం బహయటకు రాకుండా జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి పాన్ వరల్డ్ సినిమా అంటే ఈమాత్రం జాగ్రత్తలు తప్పనిసరి కదా.