Yuvraj Singh ED Summons: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్కు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ యువరాజ్ను ఆదేశించింది. ఇదే కేసులో నటుడు సోనూ సూద్ మరియు మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పలకు సైతం నోటీసులు జారీ అయ్యాయి.
నోటీసుల వెనుక కారణం: ఈడీ దర్యాప్తులో యువరాజ్ సింగ్ తన సోషల్ మీడియా వేదికగా కొన్ని బెట్టింగ్ యాప్లను ప్రచారం చేశారని తేలింది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫారమ్లు తమను తాము ‘స్కిల్-బేస్డ్’ గేమ్స్గా చెప్పుకున్నప్పటికీ.. అవి వాస్తవానికి అదృష్టంపై ఆధారపడిన లేదా అక్రమమైన జూదాని సంబంధించిన కార్యకలాపాలు అని ఈడీ గుర్తించింది. ఈ కారణంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ అంశంపై యువరాజ్ సింగ్ను విచారించేందుకు ఈడీ సెప్టెంబర్ 23న హాజరు కావాలని ఆదేశించింది.
గతంలో టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ నోటీసులు: ఈడీ విచారణకు హాజరు కావాలని గతంలో కోరుతూ నటీనటులైన దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిలకు నోటీసులు అందినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్లతో జరిగిన ఒప్పందాలు, బ్యాంక్ ఖాతాల వివరాలను వెంట తీసుకురావాలని ఈ సెలబ్రిటీలను ఆదేశించింది. ఈ కేసులో పేర్లున్న మరికొందరు నటీనటులకు, కంటెంట్ క్రియేటర్లకు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు కూడా దశలవారీగా నోటీసులు పంపనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో మొత్తం 29 మందిపై దర్యాప్తు జరుగుతోంది.
గూగుల్, మెటాలకు కూడా సమన్లు: ఈ బెట్టింగ్ యాప్ల కేసులో ఈడీ గూగుల్, మెటా సంస్థలకు సైతం సమన్లు జారీ చేసింది. ఈ యాప్ల ద్వారా మనీలాండరింగ్ హవాలా లావాదేవీలు జరుగుతున్నాయని ఈడీ గుర్తించింది. ఈ యాప్లపై తాము దర్యాప్తు చేస్తున్నప్పటికీ, గూగుల్, మెటా వంటి ప్లాట్ఫారమ్లు తమ వెబ్సైట్లపై వాటికి విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాయని ఈడీ ఆరోపించింది. ఈ కంపెనీలు బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే కాకుండా.. వాటి వెబ్సైట్ల లింక్లను అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది.


