Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుKhammam: నకిలీ విత్తనాల కట్టడికి టాస్క్ ఫోర్స్

Khammam: నకిలీ విత్తనాల కట్టడికి టాస్క్ ఫోర్స్

నకిలీ విత్తనాల కట్టడికి పోలీస్‌, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ను ప్రతి మండల, డివిజన్‌ స్థాయిలో టీమ్‌ల ఏర్పాటు చేస్తున్నారు. క్షేత్రస్ధాయి పర్యవేక్షణలో పట్టుబడితే పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామని ఖమ్మం కమిషనర్ స్పష్టంచేశారు. జిల్లాలో నకిలీ విత్తనాల కట్టడికి జిల్లాలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపేలా రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో పోలీసు, వ్యవసాయ అధికారులతో సమన్వయ సమావేశం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, నకిలీ విత్తనాలను అరికట్టడమే లక్ష్యంగా జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులలో విస్తృత తనిఖీలు, మండల, డివిజన్‌ స్థాయిలో కూడా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు నిరంతరం క్షేత్రస్థాయిలో రంగంలో ఉంటాయని తెలిపారు.

- Advertisement -

పాత నేరస్తులపైనా నిఘా పెట్టామని, బైండోవర్స్‌ కూడా చేస్తామని తెలిపారు. అవసరమైతే పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామని పెర్కొన్నారు. కొందరు దళారులు అత్యాశతో అమాయక రైతులను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటారు. రైతులు తకువ ధరకు వస్తున్నాయని తీసుకొని మోసపోతుంటారు. అయితే నకిలీ విత్తనాలతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక అప్పుల పాలవుతుంటారని, ఇలాంటి దళారులను కట్టడి చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి చర్యలు చేపట్టిన క్రమంలో పోలీస్‌, వ్యవసాయ శాఖలు సమన్వయంతో మండల, డివిజన్‌ స్థాయితో పాటు జిల్లాలో తనిఖీలు విస్తృతంగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని సూచించారు. నకిలీ విత్తనాలు ఎక్కువగా మండల కేంద్రంతో పాటు గ్రామీణ స్థాయిలో రవాణా జరిగేందుకు వీలుండడంతో అక్కడే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, గతంలో నకిలీ విత్తన నేరాలకు పాల్పడిన వ్యక్తులపై నిఘా ఉంచడంతో పాటు వారిని బైండోవర్‌ కూడా చేయాలని అన్నారు. మళ్లీ కొత్తగా కేసులు నమోదైతే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గడువు ముగిసిన విత్తనాలను, లైసెన్స్‌ లేకుండా విక్రయించే వాటిని, ఒక ప్రాంతంలో లైసెన్స్‌ కలిగి ఉండి వేరేచోట విక్రయాలు జరిపే వారిపైనా దృష్టి పెట్టాలన్నారు. స్టాక్‌ రిజిస్టర్‌, బిల్‌ బుక్‌ నిర్వహణ వంటి చిన్న చిన్న లోపాల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా మద్యం అక్రమ రవాణా నియంత్రించేందుకు జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచామని సాంకేతిక , సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ రవాణా జరిగే ప్రాంతాలు, మార్గాలను గుర్తించి సిసి కెమెరాలు, మొబైల్ చెక్‌ పోస్టులు, ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా అక్రమ రవాణాను అడ్డుకుంటున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, ఎక్సైజ్ సూపరిండెంట్ నాగిరెడ్డి, ఏసీపీలు గణేష్, భస్వారెడ్డి, రహెమాన్ , రామనుజం, ప్రసన్న కుమార్, వెంకటస్వామి, వెంకటేశ్వరరావు,వ్యవసాయ శాఖ అధికారులు కిశోర్ బాబు,
పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News