Wife murdered husband: నవ వరుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కేసులో కీలక పురోగతి సాధించినట్లు మేఘాలయ పోలీసులు వెల్లడించారు. హనీమూన్ మర్డర్ కేసులో నిందితులు సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా తాము రిలేషన్షిప్లో ఉన్నట్లు ఒప్పుకున్నారని మేఘాలయ పోలీసులు తెలిపారు. రాజ్తో కలిసి సోనమ్ తన భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఈ షాకింగ్ హనీమూన్ హత్యపై మేఘాలయ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇంకా విచారణ జరుపుతోంది.
నార్కో టెస్టు డిమాండ్ను తిరస్కరించిన పోలీసులు:
బాధితుడి కుటుంబం నార్కో టెస్ట్ చేయాలని డిమాండ్ చేయగా, పోలీసులు దానిని తిరస్కరించారు. తమ వద్ద అవసరమైన అన్ని ఆధారాలు ఉన్నాయని, నార్కో-విశ్లేషణ ఫలితాలు కోర్టులో అనుమతించబడవని పోలీసులు స్పష్టం చేశారు.ఈస్ట్ ఖాసీ హిల్స్ పోలీస్ సూపరింటెండెంట్ వివేక్ సింగ్ మాట్లాడుతూ, “విచారణలో రాజ్, సోనమ్ ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్లు అంగీకరించారు. అతను ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. క్రైమ్ సీన్ను రీక్రియేట్ చేశాం. అతడు మాకు ప్రతిదీ చూపించాడు. మా దగ్గర ఆధారాలున్నాయి. ఈ దశలో నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయడం అవసరం లేదు” అని తెలిపారు. సాధారణంగా సాక్ష్యాధారాలు లేనప్పుడు నార్కో పరీక్షలు నిర్వహిస్తారని, వాస్తవానికి నార్కో విశ్లేషణను సుప్రీంకోర్టు నిషేధించిందని ఆయన గుర్తు చేశారు.
పోలీస్ సూపరింటెండెంట్ ప్రకారం, కేవలం నేరాంగీకారాలపై ఆధారపడకుండా బలమైన, ఆమోదయోగ్యమైన సాక్ష్యాలను సేకరించడంపై దృష్టి సారించి వారు ఈ కేసును జాగ్రత్తగా పరిష్కరిస్తున్నారు. చట్టబద్ధంగా నిలబడే ఛార్జ్ షీట్ను వీలైనంత త్వరగా సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే హత్యకు డబ్బు ఒక్కటే కారణమా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వారి సంబంధానికి, వృత్తిపరమైన ఆంక్షలకు అడ్డుగా ఉన్నందున నిందితులు రాజాను అడ్డు తొలగించుకోవాలని భావించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.
అనుమానితుల విచారణ:
మేఘాలయ పోలీసులు ఇప్పుడు ఇండోర్లోని ఓ ఫ్లాట్ యజమాని లోకేంద్ర తోమర్ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. సోనమ్ రఘువంశీ ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో అరెస్టు కావడానికి ముందు కొంతకాలం ఈ ఫ్లాట్లో ఉంది. సోనమ్ వదిలిపెట్టిన బ్యాగ్ను లోకేంద్ర తోమర్ ఎందుకు తీసుకువెళ్లాడనే దానిపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఆ బ్యాగ్లో నాటు తుపాకీ, సోనమ్ ఫోన్, రాజా నగలు, రూ. 5 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకే ఈ ప్రయత్నమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు సాక్ష్యాలను తారు మారు చేశారని ఆరోపించారు. ప్రాపర్టీ డీలర్ సిలోయం జేమ్స్, సెక్యూరిటీ గార్డు బల్వీర్, సోనమ్ దాక్కున్న అపార్ట్మెంట్ యజమాని లోకేంద్ర తోమర్లను గురువారం షిల్లాంగ్ కోర్టులో హాజరుపరచనున్నారు. సిలోయం జేమ్స్, బల్వీర్లను కూడా విచారణ నిమిత్తం షిల్లాంగ్కు తీసుకురానున్నారు.