Monday, May 20, 2024
Homeఓపన్ పేజ్Testing times for opposition: ప్రతిపక్షాలకు పరీక్షా సమయం

Testing times for opposition: ప్రతిపక్షాలకు పరీక్షా సమయం

తమ బాధ్యతను విస్మరించిన ప్రతిపక్షాలు

ఎన్నికల కారణంగానే కాదు, ఇతరత్రా కూడా ప్రతిపక్షాలకు ఇది పరీక్షా సమయంగా కనిపిస్తోంది. పాలక పక్షాన్ని చూసైనా ప్రతిపక్షాలు తమ ధోరణిని మార్చుకోని పక్షంలో దేశం నియంతృత్వం వైపు వెళ్లడానికి ఎంతో సమయం పట్టదు. ప్రస్తుత పాలక పక్షం ప్రతిపక్ష కాంగ్రెస్‌ నుంచి పాఠాలు నేర్చుకుంది. తమ పాలన తీరు ఏ విధంగా ఉండేదో కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు బహుశా పాలక బీజేపీని చూస్తూ అర్థమై ఉంటుంది. తప్పుడు విధానాలను అను సరిస్తే, ప్రజాస్వామ్యానికి, రాష్ట్ర సమాఖ స్ఫూర్తికి, లౌకిక వాదానికి తప్పుడు భాష్యాలు చెప్పినందుకు, వీటి ముసుగులో తప్పుడు విధానాలను అనుసరించినందుకు ఏ గతి పడు తుందో ఇప్పుడు కాంగ్రెస్‌ తో సహా వివిధ పార్టీలకు అర్థమై ఉంటుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుతో ప్రతిపక్షాలు బలహీనపడిపోయాయా? ప్రతిపక్ష కూటమికి ఒక మూల స్తంభంగా ఉన్న కేజ్రీవాల్‌ అరెస్టు వల్ల ప్రతిపక్షాలకు నష్టమేమైనా జరిగిందా? ప్రస్తుతం దేశమంతా ఇదే రకమైన చర్చ జరుగుతోందా? ప్రతి పక్షాలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి, లక్ష్య సాధన దిశగా ప్రతిపక్షాలను ముం దుండి తీసుకు వెళ్లడానికి ప్రతిపక్షాల్లో నాయకుడే కరువైనట్టు వ్యవహరించడం జరుగు తోందని చాలామంది భావిస్తున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టు ప్రతిపక్షాలను నైతికంగా దెబ్బతీసిన మాట నిజమే కావచ్చు. ఆయన పార్టీ మీదే కాకుండా ప్రతిపక్షాల మీద కూడా ఇది నీలినీడలు ప్రసరింపజేసి ఉండవచ్చు. అంత మాత్రాన ప్రతిపక్షాలు డీలా పడిపోనవసరం లేదు. దేశంలో ప్రతిపక్షాలనేవే లేకుండా చేయాలనే బీజేపీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రతిపక్షాలే ఊతంగా మారడం మంచిది కాదు. కేజ్రీవాల్‌ ను అరెస్టు చేసింది ఇ.డి అధికారులేననడంలో సందేహం లేదు. ఇందులో కేంద్ర ప్రభుత్వం లేదని చెప్పలేం. అయితే, ప్రతిపక్షాల మీద ఇ.డి, సి.బి.ఐ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉపయోగించడమన్నది గతంలోనూ జరిగింది. ఇటువంటి పరిణామాల్ని ఒక అవకాశంగా సద్వినియోగం చేసుకోవడం రాజకీయాల్లో ఒక భాగం. ప్రతిపక్షాలు ఇప్పుడు దాన్నే అస్త్రంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ప్రతిపక్షాలను బలహీనపరచడానికి, వేధించడానికి పాలక పక్షాలు దర్యాప్తు సంస్థలను, అవినీతి నిరోధక సంస్థలను ఉపయోగపరచుకోవడమన్నది రాష్ట్రాల స్థాయిలో ఇంకా ఎక్కువ గానే జరుగుతోంది.
ఇటువంటి వాటిని చూసి ప్రతిపక్షాలు భయపడాల్సిన అవసరమేమీ లేదు. ప్రతి పక్షాలను ఎన్నికలకు ముందు కూడా దెబ్బ తీయడానికి పాలక పక్షం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింప జేయడం జరిగింది. అధికారంలో ఉన్న పక్షంలో కాంగ్రెస్‌ కూడా ఇదే విధంగా చేసి ఉండేద నడంలో సందేహం లేదు. ఏ పార్టీ అయినా ఇటువంటి పథక రచనే చేసేది. వాటికి అవకాశం లేదు కనుక పాలక పక్షాన్ని విమర్శించడం జరుగుతోంది. ఎన్నికల ప్రచారానికి తమ వద్ద నిధులు లేవని, ఆఖరికి రైలు ప్రయాణానికి కూడా తమ వద్ద డబ్బు లేదని కాంగ్రెస్‌ నాయ కులు ఆందోళన చెందుతున్నారు. తన వద్ద ఉన్న అస్త్ర శస్త్రాలను బీజేపీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటోంది. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో అది కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చడానికి గట్టి ప్రయత్నాలే చేసింది. నిజానికి ఇటువంటి రాజకీయ కుట్రలు, కుతం త్రాలన్నీ గతంలో ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీల హయాంలో జరిగినవే. అయితే గియితే, ఈసారి లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే పక్షంలో బీజేపీ కంటే తాము ఒక ఆకు ఎక్కువ చదివామనే నిరూపించుకోవచ్చు. కాంగ్రెస్‌ పార్టీకి కూడా ప్రజాస్వామ్యం మీదా, లౌకికవాదం మీదా, రాష్ట్ర సమాఖ్య విధానం మీదా నమ్మకం లేదనే విషయం తెలియంది కాదు.
పార్టీలను బలహీనపరచడానికి బీజేపీ ఇతర పార్టీల నుంచి నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతోంది. ప్రజాస్వామ్యంలో పాలక పక్షాలు ప్రతిపక్షాలను అన్ని విధాలు గానూ ప్రోత్సహిస్తాయని, అవి బలపడడానికి అవకాశాలు కల్పిస్తా యని ఊహించలేం. ఏదో విధంగా ప్రతిపక్షాలను బలహీనపరచడానికే కృషి చేస్తా యనడంలో సందేహం లేదు. ఇటువంటి విషయాల్లో ప్రతిపక్షాలే జాగ్రత్తగా, అప్రయ త్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇతర పార్టీల నుంచి నాయకులను, శాసనసభ్యులను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రస్తుతం దేశమంతా జరుగుతున్నాయి. అవకాశం దొరికే పక్షంలో కాంగ్రెస్‌ కూడా ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా బీజేపీ నుంచి నాయకులను తమవైపు రప్పించుకోవడానికి సిద్ధంగా ఉంది.
ప్రతిపక్షాలను బలహీనపరిచే ప్రయత్నం మొదటి నుంచీ జరుగుతూనే ఉంది. దాదాపు ఏడాదిగా పాలక బీజేపీ దేశంలోని కొందరు ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తూనే ఉంది. అది ఎన్నికల నాటికి పక్వానికి వచ్చింది. విచిత్రమేమింటే, బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థల దాడులు జరిపిస్తున్న నాయకులంతా నిజంగానే అవి నీతికి పాల్పడుతున్నవారే. మనీ లాండరింగ్‌, అవినీతి కార్యకలాపాలు, దేశ వ్యతిరేక వ్యవహారాలు వగైరాలలో వీరికేమీ పాత్ర లేదని, వీరు పూర్తిగా అమాయకులని, నిర్దోషులను ఎవరూ ఢంకా బజాయించి చెప్పలేరు. దేశంలో మద్యం కుంభకోణమే జరగలేదని, కేజ్రీవాల్‌ తదితరులకు ఈ వ్యవహారంతో సంబం ధమే లేదని ప్రతిపక్ష నాయకులెవరూ గట్టిగా చెప్పలేరు. అది పాలక బీజేపీ ప్రభుత్వం ద్వారా జరిగే సరికి ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాలతో విమర్శలు సాగిస్తుంటాయి.
ఏది ఏమైనా, ప్రతిపక్షాలు లేకుండా ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికల తర్వాత ప్రతి పక్షాలు లేకుండా పోవడం దేశంలో ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. సరైన ప్రతిపక్షాలు, సరైన మీడియా దేశ ప్రజాస్వామ్యానికి కొండంత బలం. అయితే, ప్రతిపక్షాలైనా, మీడియా అయినా బాధ్యతాయుతంగా, పక్షపాతరహితంగా వ్యవహరించి చాలాకాలమే అయింది. ఎన్నికల వేళయినా పాలక పక్షం, ప్రతిపక్షాలు, మీడియా తమ పాత్రను తాము నిష్పక్ష పాతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించే పక్షంలో మున్ముందు ప్రజాస్వామ్యానికి ఒక విలువ ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News