Tuesday, May 21, 2024
Homeఇంటర్నేషనల్Avadhanam in Canada: కెనడాలో వద్దిపర్తి పద్మాకర్ త్రిభాషా మహాసహస్రావధానం

Avadhanam in Canada: కెనడాలో వద్దిపర్తి పద్మాకర్ త్రిభాషా మహాసహస్రావధానం

కెనడాలో తెలుగు సాహితీ కాంతులు

కెనడాలో వద్దిపర్తి పద్మాకర్ త్రిభాషా మహాసహస్రావధాన కార్యక్రమం ఘనంగా సాగింది. బ్రహ్మశ్రీ వద్దిపర్తికి పద్మాకర్ ఇది 1250వ అష్టావధానం కావటం విశేషం. కెనడాలోని తెలుగువారు వద్దిపర్తి అవధానాన్ని ఆద్యంతం ఆస్వాదించటం విశేషం.

- Advertisement -

తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గా దేవి గుడిలో అష్టావధానం అత్యద్భుతంగా సాగింది. శరవేగంతో జరిగిన పూరణ లేఖకుల కలాలకి అందలేదు. చమత్కారమైన సంభాషణతో మొదలైన సభ, అప్రస్తుత ప్రసంగంతో ఇంకా చురుకై, ఆద్యంతమూ సభ్యులను నవ్వుల జల్లులులో ముంచెత్తింది.
చాలా సంవత్సరాల తరువాత అవధాన ప్రక్రియని వ్యక్తిగతంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని సీనియర్ సిటిజన్లు హర్షం వెలిబుచ్చగా, తెలుగులో ఇలాంటి ప్రక్రియ ఒకటి ఉందని తెలుసుకోవడం తమ అదృష్టమని యువత ఆనందం వ్యక్తం చేసారు. మొత్తానికి అన్ని వయసుల వారిని ఉర్రూతలూగిస్తూ పద్మాకర్ చేసిన అష్టావధానంతో తెలుగు సాహితీ కాంతులు కెనడాలో వెల్లివిరిసాయి.

గత రెండు నెలలుగా వద్ధిపర్తి అమెరికా, కెనడా దేశాలలో చేస్తున్న ఆధ్యాత్మిక, సాహితీ పర్యటనలో భాగంగా అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ప్రవచానాలు, ఒక అష్టావధానము, ఒక శతావధానము కూడా నిర్వహించి .. ఇప్పుడు కెనడాలో మరొక అష్టావధానం చేశారు. సమస్య, ఆశువు, వర్ణన, అప్రస్తుత ప్రసంగం ఇలా అన్ని అంశాలతో సభను మరింత రక్తికట్టించిన పృచ్ఛకులను, తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా సంస్థలను పద్మాకర్ ప్రశంసించారు. అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ సాహితీ సదస్సు తెలుగు భాషాప్రియులకు కన్నులపండుగ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలుగుతల్లి కెనడా వ్యవస్థాపకురాలు లక్ష్మి రాయవరపు మాట్లాడుతూ .. “ఏ దేశమేగినా ఎందు కాలిడినా”..అన్న చందంగా చక్కటి తెలుగు మా ప్రాణ ప్రదం, తల్లి భూమి భారతిని గౌరవించడమే జాతికి నిండుతనం అన్న భావంతో తెలుగు తల్లి కెనడా నెలకొల్పామన్నారు. తెలుగుతల్లి పత్రిక కెనడాలో ఉన్న తెలుగు ప్రతిభనంతా ఒక చోటికి చేర్చే వేదికని ఆమె వెల్లడించారు.

తెలుగువాహిని అధ్యక్షులు త్రివిక్రం సింగరాజు మాట్లాడుతూ “శ్రీకృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద చదవడం నుంచి, సభ్యులలో భావుకత పెంచే నేటి తరం వచన కవితలు వ్రాయించే దాకా పూచీ తెలుగు వాహినిది” అని తెలియజేసారు.

ఓంటారియో తెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు మురళి పగిడేల మాట్లాడుతూ ” ఓంటారియోలో ఉంటున్న తెలుగు వారికి కావలసిన సహాయం చేసి, సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడడమే ఓటీ ఎఫ్ ముఖ్య ఉద్దేశ్యమ”ని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News