Donald Trump: భారత ప్రధాని నరేంద్ర మోదీతో తన స్నేహాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి గుర్తు చేసుకున్నారు. బ్రిటన్లో పర్యటిస్తున్న ఆయన, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా “భారత్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ నాకు సన్నిహితుడు. ఇటీవల ఆయనతో మాట్లాడి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను. మా ఇద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉంది.” అని అన్నారు.
ట్రంప్ తరచుగా భారత్కు సన్నిహితుడిగా, ప్రధాని మోదీకి మంచి స్నేహితుడిగా తనను తాను అభివర్ణించుకుంటూ ఉంటారు. అయితే, ఆయన హయాంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై అదనపు సుంకాలు విధించారు. ఈ విషయంపై ట్రంప్ స్పందిస్తూ, “మోదీతో నాకు మంచి స్నేహం ఉంది. ఆయన కూడా ఒక మంచి ప్రకటన చేశారు. అయినప్పటికీ, నేను వారిపై ఆంక్షలు విధించాను. అమెరికాకు పెద్ద మొత్తంలో సుంకాలు చెల్లిస్తున్న దేశాలలో చైనా ఒకటి. చైనాపై మరిన్ని సుంకాలు విధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపివేస్తేనే రష్యా దిగివస్తుంది” అని అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్లో ఒకప్పుడు అమెరికా అతిపెద్ద సైనిక స్థావరంగా ఉన్న బగ్రామ్ ఎయిర్బేస్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని తాను భావిస్తున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. చైనా అణు ఉత్పత్తి కేంద్రాల నుంచి కేవలం గంట దూరంలో ఈ స్థావరం ఉందని పేర్కొన్నారు. గత అధ్యక్షుడు జో బైడెన్ ఎలాంటి ప్రయోజనం లేకుండా దానిని వదిలేశారని ఆరోపించారు. భవిష్యత్తులో ఈ స్థావరాన్ని చైనా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అమెరికా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


