Sunday, November 16, 2025
Homeనేషనల్Amit Shah on Retirement: అమిత్ షా రిటైర్మెంట్ ప్లాన్... ఆ తర్వాత ఏం చేయబోతున్నారో...

Amit Shah on Retirement: అమిత్ షా రిటైర్మెంట్ ప్లాన్… ఆ తర్వాత ఏం చేయబోతున్నారో చెప్పిన షా!

Amit Shah Intriguing Statement on Retirement Plans: ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న అమిత్ షా.. తన పదవీ విరమణ ప్రణాళికలను వెల్లడించారు. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పారు. రాజకీయాల నుంచి వైదొలిగిన తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారిస్తానని తెలిపారు. ఈ ఆసక్తికర ప్రకటనపై పూర్తి వివరాలు  తెలుసుకోవాలంటే..

రాజకీయాల నుంచి వైదొలిగిన తర్వాత:  కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా తన రిటైర్మెంట్ ప్రణాళికలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల నుంచి వైదొలిగిన తర్వాత తన భవిష్యత్ ప్రణాళికపై ఆయన ఓ స్పష్టమైన చిత్రాన్ని ఆవిష్కరించారు. వేదాలు, ఉపనిషత్తులు చదవడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతానని స్పష్టం చేశారు.ఢిల్లీలో జరిగిన ‘సహకార్ సంవాద్’ కార్యక్రమంలో గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
 
సహకార సంవాద్​ వేదికగా కీలక ప్రకటన: వేదాలు, ఉపనిషత్తుల పఠనం: “రిటైర్మెంట్ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవడంతో పాటు, ప్రకృతి వ్యవసాయానికే సమయాన్ని కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాను” అని అమిత్ షా తెలిపారు. 

- Advertisement -

ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత: రసాయన ఎరువులతో పండించే పంటలతో వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని షా నొక్కి చెప్పారు. జీవనశైలి రోగాలైన బీపీ, డయాబెటిస్, థైరాయిడ్ తో పాటు ప్రాణాంతక క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అందుకే ఫర్టిలైజర్ల వాడకంపై సహకార రంగం ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాలు: ప్రకృతి వ్యవసాయంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, దీని వల్ల శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుందని ఆయన వివరించారు. అధిక వర్షాలు పడినప్పుడు సాధారణంగానే నీరు పొలం నుంచి బయటకు వెళ్తుందని, కానీ ప్రకృతి వ్యవసాయంలో ఒక్క చుక్క నీరు కూడా బయటకు వెళ్లకుండా భూమిలోకి ఇంకుతుందని పేర్కొన్నారు. దీని వల్ల భూమి నీటిని పీల్చుకునే గుణం పెరుగుతుందని, రసాయనాలు వాడి వ్యవసాయం చేయడం వల్ల ఇది దెబ్బతింటుందని చెప్పారు.

వ్యక్తిగత అనుభవం: కొన్ని రోజులుగా తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నానని, దీనివల్ల దాదాపు ఒకటిన్నర రెట్లు అధిక దిగుబడి వస్తోందని ఆయన వెల్లడించారు. భూమిలో ఉండే ఎర్రలు సహజంగానే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయని, కానీ మనం వాడే ఫర్టిలైజర్ల వల్ల అవి కూడా చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సహకార శాఖపై ప్రత్యేక దృష్టి: “హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని భావించా” అంటూ సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అమిత్ షా తెలిపారు. సహకార రంగం వల్ల అనేక మంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌లో అమ్ముకునేలా సహాయపడిందని గుర్తు చేశారు. హోంశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ముఖ్యమైన శాఖ ఇచ్చినట్లు అందరూ అన్నారు. కానీ, నేను మాత్రం సహకారశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని భావించా. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని పేదలు, రైతులు, గ్రామాలు, పశుసంపద కోసం పనిచేస్తుంది” అని కేంద్ర మంత్రి వెల్లడించారు.

దేశవ్యాప్తంగా సహకార ఉద్యమానికి పిలుపు: అంతకుముందు కేంద్ర సహకార శాఖ నాలుగో ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ‘సహకార్ సమ్మేళన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘మిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన గుజరాత్‌లోని ఆనంద్‌లో చేపట్టిన కార్యక్రమానికి అమిత్ షాతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. అమూల్ డెయిరీకి సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పీపుల్, పీఏసీఎస్, ప్లాట్‌ఫాం, పాలసీ, ప్రాస్పెరిటీతో కూడిన సహకార ఉద్యమం దేశవ్యాప్తంగా రావాలని అమిత్ షా పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad