10 Trade Unions Spearhead Protests Across India : కొత్త కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ 2025 జూలై 9, బుధవారం నాడు దేశంలోని 10 ప్రధాన ట్రేడ్ యూనియన్లు ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చాయి. ఈ ఆందోళనలో దాదాపు 25 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు పాల్గొంటారని అంచనా. ఈ బంద్ బ్యాంకింగ్, పోస్టల్, బీమా, రవాణా, పరిశ్రమలు, మైనింగ్ వంటి కీలక రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆందోళనలో పాల్గొన్న సంఘాలు: ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC), ఎన్ఎండీసీ లిమిటెడ్, ఖనిజ, ఉక్కు కంపెనీల ఉద్యోగి సంఘాలు, బ్యాంకులు, బీమా కంపెనీలతో సంబంధం ఉన్న సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు మద్దతు పలికాయి. అంతేకాకుండా, యునైటెడ్ కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంస్థలు కూడా ఈ బంద్కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి.
ఎక్కువ ప్రభావం చూపిన రాష్ట్రాలు: భారత్ బంద్ ప్రభావం పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించింది. కేరళలోని కొట్టాయంలో వ్యాపార సంస్థలు బంద్కు మద్దతుగా తమ దుకాణాలను, షాపింగ్ మాల్స్ను మూసివేశాయి. పుదుచ్చేరిలోనూ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆటోలు, బస్సులు రోడ్లపైకి రాలేదు. వ్యాపారస్తులు దుకాణాలు మూసివేసి బంద్కు సంఘీభావం తెలిపారు.
ప్రధాన నగరాల్లో నిరసనలు: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించారు. సీఐటీయూ కార్యకర్తలు ఎర్ర జెండాలను చేతపట్టుకొని, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. మోదీ సర్కార్ కార్మికులకు వ్యతిరేకంగా అదానీ, అంబానీలకు మద్దతుగా పనిచేస్తోందని ఆరోపించారు. కనీస పెన్షన్ను రూ. 9,000 చేయాలన్న తమ డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
పశ్చిమ బెంగాల్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు వినూత్నంగా సంఘీభావం ప్రకటించారు. సిలిగురిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి విధుల్లో పాల్గొన్నారు. జాదవ్పూర్లో లెఫ్ట్ కార్యకర్తలు రైలు రోకో నిర్వహించారు. ఎర్రజెండాలు పట్టుకొని రైలుట్రాక్పై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. మరికొందరు కార్యకర్తలు కొత్త కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రదర్శన నిర్వహించారు.


