ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా(Maha KumbhMela) ప్రయాగ్రాజ్లో దిగ్విజయంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచం నలుమూలల నుంచి పేద, ధనిక అనే తేడా లేకుండా కోట్లాది మంది తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగిన ఈ కుంభమేళా ద్వారా ఎంతోమంది ఆర్థికంగా లాభపడ్డారు. ఛాయ్, సమోసా, స్నాక్స్, పూజా సామానులు ఇలా రకరకాల వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదించారు. ఈ క్రమంలో ఓ కుటుంబం ఏకంగా రూ.30 కోట్లు సంపాదించింది. ఈ విషయాన్ని యూపీ సీఎం యోగా ఆదిత్యనాథ్(Yogi Adityanath) చెప్పడం విశేషం.
కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లో పడవలు నడిపేవారు దోపిడీకి గురయ్యారని సమాజ్వాదీ పార్టీ చేసిన ఆరోపణలపై యోగి స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా యోగి మాట్లాడుతూ.. ఓ కుటుంబానికి 130 పడవలు ఉన్నాయని ఒక్కో పడవతో రోజుకు గరిష్ఠంగా రూ. 52 వేల వరకు సంపాదించారని తెలిపారు. అంటే 45 రోజుల్లో ఒక్కో పడవతో రూ. 23 లక్షల చొప్పున సంపాదించారని చెప్పారు. మొత్తంగా 130 పడవలతో రూ.30 కోట్ల వరకు ఆర్జించినట్టు వివరించారు.
ఇక ఎలాంటి అవాంతరాలు లేకుండా కుంభమేళాను విజయవంతంగా నిర్విహించామని వెల్లడించారు. కుంభమేళా నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 7,500 కోట్లు ఖర్చు చేయగా.. దాదాపు రూ.3లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని చెప్పారు. హోటల్ పరిశ్రమకు రూ. 40 వేల కోట్లు, ఆహారం, ఇతర నిత్యావసరాల రంగానికి రూ. 33 వేల కోట్లు, రవాణాకు రూ. 1.5 లక్షల కోట్ల మేర ఆదాయం లభించినట్టు ఆయన తెలిపారు.