దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు జారిపడిన దుర్ఘటనలో(Mumbai Train Accident) ఐదుగురు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడిన విషయం విధితమే. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి థానే జిల్లాలోని కసార ప్రాంతానికి రైలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ(Indian Railways)కీలక నిర్ణయం తీసుకుంది.
లోకల్ ట్రైన్లలో తరచూ జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు అన్ని రైలు బోగీలకు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ వ్యవస్థను(Automatic Door Closing System) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇవాళ జరిగిన దురదృష్టకర సంఘటన నేపథ్యంలో రైల్వే బోర్డు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానించింది.
ముంబై సబర్బన్ నెట్వర్క్ కోసం కొత్తగా తయారుచేస్తున్న అన్ని రైలు పెట్టెల్లో ఆటోమేటిక్ డోర్ క్లోజర్ సదుపాయాలు ఉంటాయఅని స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం సేవలు అందిస్తున్న అన్ని పాత రేక్లను కూడా దశలవారీగా ఆధునీకరించి, ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ వ్యవస్థను అమర్చనున్నట్లు
తెలిపింది.
సోమవారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో, వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తున్న రెండు రైళ్లు ఒకదానికొకటి దాటుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రెండు రైళ్ల ఫుట్బోర్డులపై నిలబడి ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒకరికొకరు తగలడంతో అదుపుతప్పి కిందపడిపోయారని చెప్పారు. ఈ ఘటనలో ఎనిమిది మంది కింద పడగా, ఐదుగురు సమీప ఆసుపత్రులకు తరలించేలోపే మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు గాయాలతో చికిత్స పొందుతున్నారని వివరించారు.
కాగా ముంబై లోకల్ ట్రైన్లు నిత్యం లక్షలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. రద్దీ సమయాల్లో ఫుట్బోర్డు ప్రయాణాలు సర్వసాధారణం. దీంతో ప్రమాదాలను అరికట్టేందుకు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ వ్యవస్థ దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రయాణికుల భద్రతను కాపాడుతుందని భావిస్తున్నారు.