New Delhi: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అర్ధాంతరంగా తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన రాజీనామ లేఖలో ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 67(ఎ) నిబంధన కింద తక్షణం తన రాజీనామాను ఆమోదించాలని రాష్ట్రపతిని జగదీప్ ధన్ఖడ్ కోరారు.
విధుల నిర్వహణలో తనకు సహకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జగదీప్ ధన్ఖడ్ కృతజ్ఞతలు తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఉపరాష్ట్రపతిగా తాను పొందిన విలువైన అనుభవాలు మరువలేనని, ఇందుకుగాను తనకు సహకరించిన మంత్రులకు అందరికీ తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
Readmore: https://teluguprabha.net/national-news/woman-kills-her-husband-with-sambar/
గతంలో గుండె సంబంధిత సమస్యలతో ఢిల్లీ లోని ఎయిమ్స్ లో చేరారు. చికిత్స అనంతరం తిరిగి బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. ఆ తరువాత నైనిటాల్లో జరిగిన కుమావూ యూనివర్శిటీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో జగ్దీప్ ధన్ఖడ్ సొమ్మసిల్లిపోయారు. అక్కడ వైద్యుల బృందం వెంటనే స్పందించడంతో ఆయన కోలుకున్నారు.
Readmore: https://teluguprabha.net/national-news/indian-politicians-pay-tribute-achuthanandan/
జగదీప్ ధన్ఖడ్ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా 2019 నుండి 2022 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. 2022 లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగదీప్ ధన్ఖడ్ విజయం సాధించారు. 2022 ఆగష్ట్ 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ ఛైర్మన్గా పార్లమెంటరీ వ్యవహారాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించినందుకు ప్రశంసలు పొందారు. అప్పటి నుంచి మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉన్నారు. రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. పదవీకాలం ఉండగానే పదవి నుంచి తప్పుకున్న రెండో వ్యక్తిగా జగదీప్ ధన్ఖడ్ నిలిచారు.


