Saturday, July 6, 2024
Homeనేషనల్Kavitha letter to CBI: విచారణకు రాను, సీబీఐకి కవిత లెటర్

Kavitha letter to CBI: విచారణకు రాను, సీబీఐకి కవిత లెటర్

సెక్షన్ 41ఏ నోటీసులు రద్దు చేయండి

కీలక అంశాలను ప్రస్తావిస్తూ సీబీఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి అని ఆమె లేఖలో కోరారు. ఒకవేళ నా నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానన్న ఆమె, ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్య ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని తేల్చి చెప్పటం విశేషం.

- Advertisement -

సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని, 2022 డిసెంబరులో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారన్నారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగ ఉందని, సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదన్నారు. నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తున్నదని, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావునిస్తోందన్నారు.

నాకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని, ఇది నా ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కులకు భంగం కలిగిస్తుందని ఆమె లేఖలో వివరించారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదు… పైగా కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది, ఈడీ నోటీసులు జారీ చేయగా నేను సుప్రీం కోర్టును ఆశ్రయించాను, ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉందని చెప్పుకొచ్చారు.

నన్ను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారని, సుప్రీం కోర్టు లో హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుందన్నారు. గతంలోనూ సీబీఐ బృందం హైదరాబాద్ లోని నా నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించానన్న కవిత, నియమ నిబంధనలను కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తానన్నారు. కానీ 15 నెలల విరామం తరువాత ఇప్పుడు పిలవడం మరియు సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తుందని, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నాకు మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించిందని, రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైందని సీబీఐకు సవివరంగా లేఖ సంధించారు.

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటానని, ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేనని, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరశీలించాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News