Friday, September 20, 2024
Homeనేషనల్KCR: గుణాత్మక అభివృద్ధి దిశగా దేశాన్ని నడిపిద్దాం

KCR: గుణాత్మక అభివృద్ధి దిశగా దేశాన్ని నడిపిద్దాం

మహారాష్ట్ర బీఆర్ఎస్ లో ఫుల్ జోష్, నిత్యం చేరికలతో కళకళలాడుతున్న పార్టీ

సంపద సృష్టించి ప్రజలకు పంచుతూ దేశాన్ని గుణాత్మక అభివృద్ధి దిశగా నడిపించేందుకు వినూత్నరీతిలో విభిన్నమైన ఆలోచనలతో పాలన కొనసాగించాల్సిన అవసరమున్నదని బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. దశాబ్ధాల స్వాతంత్రానంతరం కూడా, అవే మూస ధోరణులను కేంద్ర పాలకులు అవలంబిస్తున్నారని తెలిపారు. అపారమైన సహజ వనరులను వినియోగించుకోవడం ఎటూ చేతగాని దేశ పాలకులకు, మహిళలు, రైతులు, యువత, వృత్తి కులాలు వంటి సంపద సృష్టించే అపూర్వమైన మానవ వనరులను కూడా సరైన పంథాలో వినియోగించుకోలేక పోతున్నారని స్పష్టం చేశారు. ఈ దిశగా దార్శనికత లేకపోవడం కారణంగా దేశంలో జరగాల్సినంత అభివృద్ధి జరగడం లేదని అధినేత సిఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ పార్టీ కేవలం వొక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో పరివర్తన చెందిన భారత దేశాన్ని తీర్చిదిద్దే మహోన్నత లక్ష్యంతో ఏర్పాటయిన ‘ భారత్ పరివర్తన్ మిషన్ ’ అని సిఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

- Advertisement -


మహారాష్ట్ర నుంచి పలు రంగాలకు చెందిన ప్రముఖుల చేరికలు గురువారం నాడు బిఆర్ఎస్ పార్టీలోకి కొనసాగాయి. ముంబయి సహా పలు ప్రాంతాలనుంచి వచ్చిన వారిని అధినేత సిఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ….నీరు బొగ్గు సహా దేశంలో అవసరాలకు మించి నిల్వ వున్న సహజ సంపద, ప్రకృతి వనరుల గురించి వివరించారు. ఏడు దశాబ్ధాలు దాటుతున్నా వాటిని సరియైన రీతిలో వినియోగించుకోవడం చేతగాక ప్రజల కష్టాలకు కన్నీల్లకు కారణమౌతున్నారని కేంద్ర పాలకులను సిఎం దుయ్యబట్టారు.

ఇంత జరుగుతున్నా ఇటువంటి అభివృద్ధి నిరోధకులకే వోట్లేసుకుంటూ వారిని కాకుంటే వీరిని వీరిని కాకుంటే వారిని ఇంకెన్నాల్లు గెలిపించుకుంటూ పోదామని సిఎం ప్రశ్నించారు. కుల మతాలకతీతంగా సమస్త ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీని నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన చైతన్యం ప్రజల్లో మరింతగా రావాల్సి వున్నదన్నారు. ఆ దిశగా ప్రతి వొక్క బిఆర్ఎస్ కార్యకర్త పనిచేయాల్సిన అవసరమున్నదన్నారు. దేశ పాలకుల ఆలోచనల్లో మార్పు రావాలన్నారు. నల్లజాతీయుల పట్ల తర తరాలుగా వివక్ష చూపిన అమెరికా దేశం, బరాక్ ఓబామా వంటి నల్లజాతీయున్ని దేశాధ్యక్షున్ని చేసి తన పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నదని వివరించారు. అభ్యుదయభావాలతో భిన్నమైన ఆలోచనా ధోరణులున్నప్పుడే దేశంలో సామాజిక సమానత్వం సాధ్యమౌతుందని సిఎం స్పష్టం చేశారు.


పురుషునికి సమాన సంఖ్యలో వున్న మహిళా శక్తిని కేవలం వంటింటికి పరిమితం చేస్తూ, ఉత్పాదక రంగంలో, సంపద సృష్టిలో వారిని భాగస్వాములను చేయక పోవడం వలన దేశం నష్టపోతున్నదని సిఎం పునరుద్ఘాటించారు. మహిళలు యువత సహా పలు రకాల మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. వారి వారి సామర్థ్యాలను గుర్తించి ఉత్పాదక, అనుత్పాదక రంగాల్లో వారికి అవకాశాలు కల్పించాలే తప్ప.. కేవలం వారి కులాన్ని బట్టో వర్గాన్ని బట్టో కాదని స్పష్టం చేశారు. ఇటువంటి వివక్షతకు స్వస్తి పలకాలని, ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే ఈ దిశగా సమూల మార్పు జరగాల్సిందేనని అన్నారు. బిఆర్ఎస్ పార్టీతోనే అన్ని రంగాల్లో గుణాత్మకంగా దేశాభివృద్ధి సాధ్యమౌతుందని సిఎం స్పష్టం చేశారు.

కాగా… బిఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో రోజు రోజుకూ వృద్ధి చెందుతున్నదనే అంశం పై మహారాష్ట్ర నేతలు సిఎం తో చర్చించారు. ఇటీవలి పండరిపూర్ పర్యటన తర్వాత మహారాష్ట్రలోని అన్ని పార్టీలకు చెందిన ముఖ్యనేతలు స్పందించడం చూస్తుంటే వారికి బిఆర్ఎస్ ఎదుగుదలను చూసి భయం పట్టుకున్నదని అర్థమౌతోందన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడ చూసినా బిఆర్ఎస్ గురించిన చర్చనే నడుస్తున్నదనీ, రైతులతో పాటు, వృత్తికులాలు, పేదలు అన్ని వర్గాలు పార్టీని విపరీతంగా ఆదరిస్తున్నారు. పల్లె పల్లెనా బిఆర్ఎస్ సభ్యత్వాలు జోరుగా సాగుతున్నాయని వారు అధినేతకు వివరించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ….ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలకు సరియైన రీతిలో సంపూర్ణమైన రాజకీయ పార్టీ లేదు. అన్నీ సగం సగం చీలిన పార్టీలే వున్నాయి. రేపో మాపో కాంగ్రెస్ కూడా చీలిపోయే పరిస్థితి వున్నది. మహారాష్ట్ర ప్రజలను అక్కడి అన్ని పార్టీలు పిచ్చోల్లను చేస్తున్నాయి.’’ అని వారు ఆవేదన చెందారు.

ఇటువంటి రాజకీయ సంక్షోభ సమయంలో, తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశ ప్రజలముందుంచిన బిఆర్ఎస్ పార్టీని మహారాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని వారు మరోసారి తెలిపారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ అనే నినాదంతో ఏకోన్ముఖంగా ముందుకు పోతామని వారు ఉత్సాహంగా తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిలో…. మహారాష్ట్ర పూణే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎల్. టి. సావంత్, దక్షిణ ముంబయి ఎన్సీపీ అధ్యక్షులు మానవ్ వెంకటేశ్, సిబిఐ లో పనిచేసి రిటైరయిన లక్ష్మణ రాజ్ సనప్, నిలేశ్ మధుకర్ రాణే వంటి ప్రపంచ ఛాంపియన్ క్రీడాకారుడు, జెడ్పీ మెంబర్ భగవాన్ సనప్, నాగ్ పూర్ ఎన్సీపీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ సామాజిక సేవకుడు డా.కిరణ్ వైద్య, ఉత్తమ్ రావు వాగ్, మహారాష్ట్ర ఎంబీటీ అధ్యక్షుడు అజర్ అహ్మద్, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఘనశ్యామ్ బాపూ హక్కే, పహిల్వాన్ అప్పాసాహెబ్ అరేన, ఎంపీగా పోటీ చేసిన సంతోష్ బిచుక్లే, ప్రకాశ్ సాహురావు బోసాలె, మహారాష్ట్రకు చెందిన పలువురు ఆర్మీ అధికారులు సహా ముంబయి నుంచి వర్షి, బాంధ్రా, ధారావి, వంటి ప్రాంతాల నుంచి పలు పార్టీలకు చెందిన సీనియర్లు, యువనేతలు, పలువురు మహిళా నేతలు, మాజీ ఉన్నతాధికారులు, లాయర్లు, డాక్టర్లు, ఇంకా మహారాష్ట్ర పర్భనీ, మాన్వట్ వంటి జిల్లాలకు చెందిన పలు పార్టీల నేతలు పలువురు ప్రముఖులు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు.


ఈ సందర్భంగా….బిఆర్ఎస్ నేతలు హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ బిబి పాటిల్, శంకరన్న దోంగ్డే, మాణిక్ కదమ్, ఎస్ వేణుగోపాలచారి, ముంబై ధారవి దేవానంద్ నాగెల్ల, షివ్డీ నుంచి రమేశ్ బండారం తదితరులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News