Saturday, July 27, 2024
Homeనేషనల్Malladi: నాటక రంగం పూర్వవైభవం

Malladi: నాటక రంగం పూర్వవైభవం

భారత్ రంగస్థల మహోత్సవ్ వేడుకలు

నాటక రంగం పూర్వవైభవం తెస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నాటక రంగం పూర్వవైభవం సంతరించుకోవాలంటే ఇలాంటి నాటక మహోత్సవాలు పెద్ద సంఖ్యలో జరగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. న్యూ ఢిల్లీకి చెందిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 25వ భారత్ రంగస్థల మహోత్సవాలు 2024 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

- Advertisement -

ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు దేశవ్యాప్తంగా 15 నగరాల్లో నిర్వహిస్తున్న నాటక మహోత్సవాల్లో భాగంగా మంగళవారం నుంచి ఆదివారం వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎంపికచేయబడిన అత్యుత్తమ ఆరు నాటికల ప్రదర్శన ప్రతి రోజూ సాయంత్రం ప్రదర్శించనున్నారు. నాటక మహోత్సవాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యఅతిధిగా హజరై మాట్లాడుతూ మన విజయవాడలో రెండవ సారి జాతీయ స్థాయి నాటక మహోత్సవాలు జరగటం అభినందనీయమన్నారు. పూర్వం మన జీవితంలో నాటికలు ఒక భాగమైపోయాయన్నారు. శ్రమజీవుల కష్టాలను మరిచి ఉల్లాసపరటానికి, మంచి వైపు మానవుడు పయనించటంలో భాగంగా ఆలోచనాత్మక నాటికలు నిలిచాయని మల్లాది విష్ణు గుర్తుచేశారు.


మన రాష్ట్రంలో నాటక రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారన్నారు. సామాజిక అంశాలతో కూడిన నాటకాల వలన ఆలోచనా శక్తి పెరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కందుకూరి, గురజాడ, చిలకమర్తి తదితర మహానుభావులు అప్పటి సమాజంలో నెలకొన్న సమాజ రుగ్మతలపై కలం ఎక్కుపెట్టారని, తమ నాటికల ద్వారా ఆలోచింపచేసి వారిని ఆలోచనాత్మకంగా అడుగులు వేసే విధంగా పరివర్తన తీసుకురాగలిగారన్నారు. నాటక రంగాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత్ రంగస్థల మహోత్సవ్ ల నిర్వహణతో దేశంలోని ఇతర రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందన్నారు.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మన దేశంలో ఆరు దశాబ్ధాలకు పైగా విశేష సేవలు అందిస్తున్నదని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్. కె. శ్రీనివాసరావు అన్నారు. మన దేశంలో నాటక రంగానికి చేయుత నందించటంలో, నాటక రంగాన్ని ఉన్నత స్థితికి చేర్చటంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పాత్ర ఎనలేనిదన్నారు. నాటికలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయని తెలిపారు. ఇప్పటికీ నాటికలకు ఆదరణ లభిస్తుండటం ఎంతో అభినందనీయమన్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే నాటికలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. అప్పుడే నాటక రంగానికి పూర్వ వైభవం సిద్ధిస్తుందన్నారు.


భారత్ రంగస్థల మహోత్సవ్ లో భాగంగా మొదటి రోజు ఎన్. డీ. రిపర్టరీ కంపెనీ, న్యూఢిల్లీ వారి మై రి మె కా సె కహూ నాటకంను ప్రదర్శించారు. ఈ నాటకానికి ఆధారం విజయదాన్ దేతా రాసిన దువిధ కథ. సమాజంలో స్త్రీ తన కోరికలు, భావోద్వేగాలు, సామాజిక నిబంధనల మధ్య పడే సంఘర్షణే ప్రధాన ఇతివృత్తింగా తీసుకుని నాటకం ప్రదర్శించారు. నాటకం ఆధ్యంతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముందుగా ముఖ్య అతిధులను శాలువాలు, మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రెస్పెక్టరీ చీప్ రాజేష్ సింగ్, సాంస్కతిక శాఖ డైరక్టర్ మల్లికార్జునరావు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అసిస్టెంట్ ప్రోఫెసర్ వివేక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News