అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతుల కుటుంబాలకు ఎయిరిండియా(Air India) నష్ట పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున అదనపు సహాయం చేస్తామిన తెలిపింది. ఇంతకుమందు టాటా కంపెనీ ప్రకటించిన కోటి రూపాయలతో పాటు అదనంగా రూ.25లక్షలు అందిస్తామని తెలిపింది. అలాగే క్షతగాత్రులను ఆసుపత్రి ఖర్చులు కూడా భర్తిస్తామని పేర్కొంది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రమాద ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. ఇక బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని వెల్లడించారు.
కాగా ఈనెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే క్రాష్ అయిన విషయం విధితమే. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోగా.. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బతికారు. ఇక సమీపంలోని బీజీ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలడంతో 33 మంది మెడికోలు సైతం మరణించారు. ఇందులో 24 మంది స్పాట్ లోనే చనిపోగా.. మిగిలిన ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఈ ఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రమాదాల్లో చనిపోతే ఆ కుటుంబం అనుభవించే బాధ తనకు తెలుసు అని.. తన తండ్రి ఎర్రన్నాయుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి తన మనసు ఎంతో భారంగా ఉందన్నారు.