Air India Plane Crash: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఎయిర్ ఇండియా కంపెనీ ప్రకటన విడుదల చేసింది.
“ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ జాతీయుడు ఉన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నాం” అని పేర్కొంది.
అలాగే ప్రయాణికుల బంధువులు, కుటుంబసభ్యుల సమాచారం కోసం ప్రత్యేకంగా ఒక హాట్లైన్ నంబర్ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. మరింత సమాచారం అందించేందుకు 1800 5691 444 నెంబర్ ఏర్పాటు చేశామని వెల్లడించింది. ఈ ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం సివిల్ ఆసుపత్రి సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్, జనావాసాలపై కూలింది. ఈ ఘటనలో మెడికల్ కాలేజ్ బిల్డింగ్ రెండు అంతస్తుల వరకు భారీగా మంటలు అంటుకున్నాయి. మధ్యాహ్న సమయం కావడంతో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ భోజనానికి వచ్చారు. ఆ సమయంలోనే ఒక్కసారిగా విమానం కూలడంతో(Plane Crash) 20 మందికి పైగా మెడీకోలు అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం. మరింత మంది మృతి చెందే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అగ్ని మాపక సిబ్బంది సహాయంతో మంటలు అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులతో సమీప ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.