అహ్మదాబాద్లో జరిగిన విమాన(Plane Crash) ప్రమాదంపై ప్రధాని మోదీ (PM Modi) ఆరా తీశారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఎప్పటికప్పుడు వివరాలను తనకు అందించాలని సూచించారు.
ఇవాళ మధ్యాహ్నం 1.17 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఎయిరిండియాకు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్కు బయలుదేరింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 2 నిమిషాలకే కూలిపోయింది. ప్రమాదం సమయంలో విమానం 825 అడుగుల నుంచి కుప్పకూలింది. విమానం నేలను ఢీ కొట్టడంతో వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో మొత్తం 254 మంది ఉండగా.. వీరిలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే సిగ్నల్స్ కోల్పోయినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ (DGCA) ధృవీకరించింది. పైలట్లు ‘‘మేడే మేడే’’ అంటూ అహ్మదాబాద్ ఏటీసీకి అత్యవసర సందేశం పంపించారని.. ఆ తర్వాత ఎలాంటి సందేశం రాలేదని తెలిపింది. ఈ విమానం కెప్టెన్గా సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుందర్ ఉన్నారని తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్ 8,200 గంటల అనుభవం.. కోపైలట్కు 1100 గంటల విమానయాన అనుభవం ఉందని పేర్కొంది.
ఈ ప్రమాదంతో ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ప్రమాదంతో ఎయిర్ పోర్టుతో పాటు సమీపంలోని అన్ని రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం కూలిన ఘటన తెలుసుకున్న ప్రయాణికుల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.