RBI Restrictions On Co-operative Bank: కళ్ళముందే లక్షల డబ్బున్నా, అవసరానికి పదివేలు కూడా చేతికందకపోతే ఆ బాధ వర్ణించలేనిది. ఆ క్షణంలో ఎంత నిస్సహాయత, ఎంత ఆవేదన ఉంటుందో ఊహించండి! కలలో కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి క్లిష్ట పరిస్థితినే ఎదుర్కొంటున్నారు కేరళలోని ఇరింజాలకుడ టౌన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ బ్యాంకుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కఠిన ఆంక్షలు విధించింది. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడే నెపంతో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది ఖాతాదారులను ఆందోళనలోకి నెట్టింది. అసలు ఈ బ్యాంకుపై ఆర్బీఐ ఎందుకు కొరడా ఝుళిపించింది..? ఈ ఆంక్షల వెనుక అసలు కారణాలేంటి..? డిపాజిటర్ల సొమ్ము భవిష్యత్తు ఏమిటి..?
ఆరు నెలల పాటు ఆంక్షల గండం:
ఇరింజాలకుడ టౌన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో, రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగింది. జూలై 30న జారీ చేసిన సర్క్యులర్లో, ఈ బ్యాంకుపై పలు తీవ్రమైన ఆంక్షలను ప్రకటించింది.ఈ ఆదేశాల ప్రకారం.
గరిష్ట విత్డ్రా రూ.10,000 మాత్రమే:
ఖాతాదారులు తమ పొదుపు లేదా కరెంట్ ఖాతాల నుంచి ఆరు నెలల పాటు గరిష్టంగా కేవలం రూ.10,000 మాత్రమే విత్డ్రా చేసుకోగలరు.
రుణాలు, డిపాజిట్లపై నిషేధం: బ్యాంకు కొత్తగా ఎలాంటి రుణాలు జారీ చేయకూడదు, అలాగే కొత్త డిపాజిట్లను స్వీకరించకూడదు.
ఆస్తుల అమ్మకంపై వేటు: ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా బ్యాంకు తన ఆస్తులను బదిలీ చేయడం గానీ, విక్రయించడం గానీ చేయరాదు.
ALSO READ: https://teluguprabha.net/national-news/three-time-tamil-nadu-chief-minister-ops-quits-bjp-alliance/
ఖర్చులపైనా పరిమితులు: జీతాలు, అద్దె, విద్యుత్ ఛార్జీలు వంటి అత్యవసర చెల్లింపులకు మాత్రమే బ్యాంకు డబ్బును ఖర్చు చేయడానికి అనుమతి ఉంది. ఈ ఆంక్షలు జూలై 30, 2025 నుంచి ఆరు నెలల పాటు అమలులో ఉంటాయని, పరిస్థితిని బట్టి వీటిని సమీక్షించడం లేదా మార్పులు చేయడం జరుగుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఆర్బీఐ ఎందుకీ నిర్ణయం తీసుకుంది:
బ్యాంకు పనితీరును మెరుగుపరచాలని ఆర్బీఐ బోర్డు, సీనియర్ యాజమాన్యంతో పలుమార్లు సంప్రదింపులు జరిపింది. అయితే, పర్యవేక్షణలో గుర్తించిన లోపాలను సరిదిద్దడానికి బ్యాంకు సరైన చర్యలు తీసుకోకపోవడం, కనీస నియంత్రణ మూలధనాన్ని సమకూర్చడంలో విఫలం కావడం వంటి కారణాలతో డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ కఠిన ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చిందని ఆర్బీఐ తన సర్క్యులర్లో పేర్కొంది.
ALSO READ:https://teluguprabha.net/national-news/malegaon-blasts-2008-verdict-nia-court-acquits-all-accused/
లైసెన్స్ రద్దు కాలేదు.. కానీ:
ఈ ఆంక్షలు విధించినంత మాత్రాన బ్యాంకు లైసెన్స్ను రద్దు చేసినట్లు కాదని ఆర్బీఐ తన ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు ఈ ఆంక్షల నడుమనే తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. పరిస్థితిని ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటుంది. అయితే, ఈ వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో డిపాజిటర్లు బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిపాజిట్లను పూర్తిగా ఇవ్వాలని కోరినప్పటికీ, ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఒక్కొక్కరికి రూ.10,000 మించి ఇవ్వలేమని బ్యాంకు అధికారులు తేల్చిచెప్పారు.


