RJD Cheif Lalu Prasad yadav Family Crisis: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఒక్కసారిగా విభేదాలు బయటపడుతున్నాయి. తాజాగా జరిగిన బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో కలహాలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే లాలూ కూతురు, గతంలో లాలూకు కిడ్నీ దానంగా ఇచ్చిన రోహిణి ఆచార్య సంచలన ఆరోపణలు చేశారు. తన కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. తనపై తన సోదరుడు తేజస్వీ యాదవ్ చెప్పులతో దాడి చేసినట్లు వెల్లడించింది. తనకు జరిగిన అవమానం గురించి భావోద్వేగ పోస్ట్ పెట్టింది. ఇదిలా ఉంటే, తాజాగా లాలూ మరో ముగ్గురుకు కుమార్తెలు కూడా ఆయనతో విభేదించి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. పాట్నాలోని లాలూ నివాసం నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆర్జేడీ అధినేత్రి రాజలక్ష్మీతో పాటు రాగిణి, చందాలు తమ పిల్లలతో కలిసి ఢిల్లీ వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఆర్జేడీ అధినేత కుటుంబంలో గొడవను ఎత్తి చూపుతోంది. ఇప్పటికే, లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను ఆర్జేడీ నుంచి బహిష్కరించడంతో ఆయన వేరే పార్టీ పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన తన సోదరి రోహిణికి మద్దతు తెలిపారు. అంతకుముందు, శనివారం రోహిణి ఆచార్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తేజస్వీ యాదవ్ సన్నిహితుల వల్ల తాను తన కుటుంబానికి దూరమైనట్లు ఆమె వాపోయారు. సంజయ్ యాదవ్, రమీజ్ వల్ల తమ ఇంట్లో విభేదాలు వచ్చినట్లు తెలిపారు. తనను తన కుటుంబం నుంచి దూరం చేశారని, తాను కిడ్నీ దానం చేసిన తర్వాత కోట్ల రూపాయలు తీసుకున్నట్లు అబద్ధాలు చెబుతున్నట్లు రోహిణి ఆరోపించారు.
ఘోర పరాజయంతో మొదలైన లుకలుకలు..
తాజా విభేదాల నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున రాజలక్ష్మీ, రాగిణి, చందాలు లాలూ రబ్రీ దేవి నివాసం నుంచి బయటకు వెళ్లారు. గత రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనలో వీరంతా బాధపడ్డారని తెలుస్తోంది. ఇప్పుడు లాలూ ఇంట్లో ఆయనతో పాటు రబ్రీ దేవి, మరో కుమార్తె మీసాభారతి మాత్రమే ఉన్నారు. లాలూ, రబ్రీదేవిలకు మొత్తం ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. మిసా భారతి, రోహిణి ఆచార్య, రాగిణి యాదవ్, హేమా యాదవ్, అనుష్క రావు, తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్, రాజ్య లక్ష్మీ సింగ్ యాదవ్. కుమారులు ఇద్దరు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ భాగస్వామ్యంలో మహాఘట్ బంధన్ కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ ఉన్నారు. ఒకవేళ, ఈ కూటమి విజయం సాధిస్తే ఆయన సీఎం అయ్యేవారు. అనుకున్న విధంగా సీట్లు రాకపోవడం, అధికారంలోకి రాకపోవడంతో లాలూ కుటుంబంలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఈ విభేదాల నేపథ్యంలో ఆర్జేడీ పార్టీలోనూ గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


