“Jersey Cow” Remark For Tejashwi Yadav’s Wife: బీహార్ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ, రాజకీయాలు వ్యక్తిగత దూషణలతో వేడెక్కుతున్నాయి. మొదట ప్రధానిని, ఇప్పుడు తేజస్వి యాదవ్ భార్యను లక్ష్యంగా చేసుకోవడంతో వివాదం ముదురుతోంది. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మాజీ నేత, ఇటీవలే పోక్సో కేసులో జైలు నుంచి విడుదలైన రాజ్బల్లభ్ యాదవ్.. తేజస్వి యాదవ్ భార్య రాజశ్రీ యాదవ్పై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
నవాడా జిల్లాలోని నార్దిగంజ్లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, “ఓట్ల కోసం కులం కావాలి, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం రాష్ట్రం, కులం కాని అమ్మాయి కావాలా? హర్యానా, పంజాబ్లో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అతను మనిషిని పెళ్లాడాడా లేక జెర్సీ ఆవును తెచ్చుకున్నాడా? యాదవ కులంలో అమ్మాయిలు లేరా?” అంటూ తేజస్వి భార్యను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
ALSO READ: Modi Seated In Last Row At Workshop: సాదాసీదాగా.. చివరి సీట్లో మోడీ
ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ తీవ్రంగా మండిపడింది. ఆర్జేడీ నేత కౌశల్ యాదవ్ మాట్లాడుతూ, “ఇది కేవలం రాజశ్రీ యాదవ్పై జరిగిన దాడి కాదు, యావత్ బడుగు, దళిత సమాజం మనోభావాలను దెబ్బతీయడమే. లాలూ ప్రసాద్ యాదవ్ దేశంలోని అగ్రనేతల్లో ఒకరు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన కోడలిపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం యావత్ సమాజాన్ని తీవ్రంగా బాధించింది,” అని అన్నారు.
“పదేళ్ల క్రితం ఓ కుర్మీ వర్గానికి చెందిన అమ్మాయిపై అత్యాచారం చేసిన కేసులో నితీశ్ కుమార్ ప్రభుత్వం అతడిని జైలుకు పంపింది. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చి లాలూ కుటుంబంపై బురద చల్లడం అతనికి దక్కిన బహుమతా? మహిళలను తప్పుడు దృష్టితో చూడటమే అతని నైజమా?” అంటూ కౌశల్ యాదవ్ నిప్పులు చెరిగారు.
రాజకీయాలకు దూరంగా, తన ఇద్దరు పిల్లలను పెంచుకుంటున్న మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్బల్లభ్ నీచమైన ఆలోచనా ధోరణికి నిదర్శనమని కౌశల్ యాదవ్ అన్నారు. ఈ ఘటనపై ఆర్జేడీ మహిళా విభాగం రాజ్బల్లభ్ యాదవ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపింది.
ALSO READ: Prajwal Revanna : జైల్లో లైబ్రరీ క్లర్క్గా మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ.. రోజుకు రూ.522 జీతం!


