Consumer Court Orders : ‘ఇంటిని మార్చే క్రమంలో నా వస్తువులను మాయం చేశారు. మీ నిర్లక్ష్యం కారణంగా మా విలువైన వస్తువులు పగిలిపోయాయి.’ అని బాధితులు గొంతు చించుకుంటే. ఇలాంటి సందర్భాల్లో… ”ఇది మామూలే కదా, ఏం చేయగలం?” అని సదరు షిఫ్టింగ్ కంపెనీలు అలవోకగా బదులిస్తాయి. కానీ, ఈసారి కథ మారింది. ప్యాకర్స్ అండ్ మూవర్స్ నిర్లక్ష్యానికి కర్ణాటక వినియోగదారుల కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తన ఇంటి సామాగ్రిని మార్చాలని చందన్ నూకాల (బన్నెర్ఘట్ట నివాసి) నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతను నో బ్రోకర్ టెక్నాలజీ సొల్యూషన్స్ అనే ప్రముఖ ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థతో సంప్రదింపులు జరిపి, రూ. 30,000కు తన వస్తువులను తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అక్కడ అసలు సమస్య మొదలైంది :
చందన్ తరలించిన వస్తువుల్లో రూ. 2 లక్షల విలువైన వాటర్ రోయింగ్ మెషీన్ కూడా ఉంది. నో బ్రోకర్ సిబ్బంది ఈ మెషీన్ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేర్చారు. అయితే, సామాగ్రిని బెంగళూరులో పరిశీలించిన చందన్, ఆ మెషీన్ పూర్తిగా దెబ్బతిని ఉండటం చూసి నివ్వెరపోయాడు.
నిర్లక్ష్యం వెనుక కథ:
వాటర్ రోయింగ్ మెషీన్ దెబ్బతినడానికి నో బ్రోకర్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని చందన్ గుర్తించాడు. రవాణా సమయంలో, ముఖ్యంగా వాహనం మార్చే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో జరిగినట్లు తెలిసింది. మరో వాహనం లోకి వస్తువులను మారుస్తున్నట్లు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. ఈ విషయమై చందన్ ఫిర్యాదు చేస్తే, నో బ్రోకర్ కంపెనీ కేవలం రూ. 500 పరిహారం, ఒక క్షమాపణ లేఖ మాత్రమే పంపింది. రూ.2 లక్షల నష్టానికి రూ.500 పరిహారం అనేది సంస్థ నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని స్పష్టం చేసింది.
కోర్టులో న్యాయ పోరాటం :
చందన్ నో బ్రోకర్ కంపెనీపై వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. కంపెనీ తన ప్రీమియం రోయింగ్ మెషీన్ను అనుమతి లేకుండా విడదీసి, సరిగా అమర్చలేదని, రవాణాలో జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. వారిని సంప్రదించినా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని వివరించాడు.
తీర్పు.. వినియోగదారుడి విజయం :
చందన్ సమర్పించిన ఆధారాలు, వాదనలను పరిశీలించిన కోర్టు, నో బ్రోకర్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించింది. దీంతో, కోర్టు కీలక తీర్పును వెలువరించింది.
దెబ్బతిన్న రోయింగ్ మెషీన్కు రూ. 1,75,000 పరిహారం.
మానసిక వేదనకు అదనంగా రూ. 10,000 చెల్లింపు.
చట్టపరమైన ఖర్చుల కింద రూ. 5,000 తిరిగి చెల్లించాలి.
ఈ తీర్పు ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థలకు ఒక గట్టి హెచ్చరికలా నిలిచింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వినియోగదారుల కోర్టు ఊరుకోదని ఈ కేసు స్పష్టం చేసింది.