Case Booked on Jagan Mohan Reddy: ఏపీ మాజీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు సంబంధించి నల్లపాడు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. జగన్తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నాయకులకు సైతం నల్లపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న మిర్చి రైతులను పరామర్శించేందుకు జగన్ గుంటూరు యార్డుకు వెళ్లారు. అయితే ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కోడ్ ఉల్లఘించి వైకాపా నాయకులు ఎటువంటి అనుమతి లేకుండా యార్డులోకి ప్రవేశించి హడావుడి సృష్టించారని.. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు కూడా చేశారని పోలీసులు తెలిపారు.
దీందో జగన్తో పాటు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్నాయుడు, మోదుగుల వేణుగోపాల్రెడ్డి వంటి వైకాపా నాయకులపై పోలీసు కేసు నమోదైంది. ఇప్పటికే పోలీసులు వీరికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 41ఏ కింద నోటీసులు అందించారు. విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్కు స్వయంగా హాజరు కావాలని ఆ నోటీసుల్లో వైసీపీ లీడర్లకు సూచించారు. అయితే కొద్ది రోజుల క్రితమే రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతికి సంబంధించి జగన్పై ఒక కేసు నమోదై ఉంది.
తాజాగా జగన్పై మరో కేసు నమోదు కావడంతో వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం కక్షపూరిత చర్య అని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. అందులో భాగంగానే వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైసీపీ మండిపడుతోంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేక కేసులు, దాడులు, కుంభకోణాల పేరుతో కూటమి ప్రభుత్వం పబ్బం గడుపు గడుపుతోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.