World Population Day: జనాభా నియంత్రణ కాకుండా, నిర్వహణ కూడా ముఖ్యం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని (World Population Day) పురస్కరించుకొని వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు కలిగినవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలని చట్టాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో జనాభా నియంత్రణ కన్నా, జనాభా నిర్వహణపై ఎక్కువ దృష్టి పెడితే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ఇది ప్రస్తుత కాలానికి చాలా అవసరం అని పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా పాలసీలను మార్చకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించారు.
1985 జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అప్పట్లో ఎక్కువ జనాభా అధికంగా ఉన్న దేశాలను అభివృద్ధి చెందని దేశాలుగా కాస్త చులకనగా చూసేవారని చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ ఇప్పుడు ప్రపంచం మారిందని.. అత్యధిక జనాభా కలిగిన దేశాలే గ్లోబల్ మార్కెట్లలో కీలకంగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. మానవ వనరులే ప్రధాన ఆస్తిగా మారుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ఇదే కార్యక్రమంలో ప్రత్యుత్పత్తి రేటు (Fertility Rate)ను సైతం సీఎం ప్రస్తావించారు. ‘‘ప్రత్యుత్పత్తి రేటు 2.1గా ఉంటే జనాభా స్థిరంగా కొనసాగుతుంది. కానీ మన రాష్ట్రంలో ఇది 1.8గా ఉందని అన్నారు. ఇది భవిష్యత్తులో మానవ వనరుల కొరతకు దారితీయొచ్చని చెప్పారు. అందుకే జనాభా నిర్వహణకు సంబంధించి సమర్థవంతమైన పాలసీల రూపకల్పన చేయాలని అన్నారు.
‘‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్యాన్ని, విద్యను, సామాజిక భద్రతను మెరుగుపర్చే దిశగా సమగ్రంగా ముందడుగు వేయాలని అన్నారు. జనాభా సిస్టమ్పై అవగాహన కల్పిస్తూ, సమర్థవంతమైన ప్రణాళికలను అమలు చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు స్థిరమైన భద్రత కల్పించగలమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఆరోగ్య శాఖ ప్రతినిధులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు. జనాభా నిర్వహణపై ప్రజలలో అవగాహన పెంచేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వారు వివరించారు.


