AHMEDABAD PLANE CRASH 2025 : సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు డేవిడ్ వార్నర్, తాజాగా ఎయిర్ ఇండియాపై చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రపంచవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతుండగా, వార్నర్ కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపాడు. అయితే, ఇదే సమయంలో అతను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చేసిన పోస్ట్, ఎయిర్ ఇండియా భద్రతా ప్రమాణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సంచలన ప్రకటన చేశాడు.
అసలేం జరిగింది?
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై యూట్యూబ్లో ఓ వీడియో కనిపించింది. దాని కింద ‘వివేక్ పటేల్’ అనే పేరుతో ఒక పెద్ద కామెంట్ ఉంది. అందులో, “నేను ఎయిర్ ఇండియాలో పనిచేశాను. ఈ విమానంలో ఏళ్ల తరబడి సమస్యలున్నా, పైలట్లు, ఇంజనీర్లు చెప్పినా కంపెనీ పట్టించుకోలేదు. ఏదైనా జరిగితే మాత్రం సిబ్బందినే నిందిస్తారు” అని ఆరోపించాడు. ఈ కామెంట్ను స్క్రీన్షాట్ తీసి వార్నర్ తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ, “ఇది నిజమైతే, ఎయిర్ ఇండియాలో ఇక ప్రయాణించను” అని ఘాటుగా స్పందించాడు. అయితే, ఆ కామెంట్ చేసిన వ్యక్తి ఎవరన్నది ఇంకా స్పష్టంగా తెలియదు.
గతంలోనూ ఎయిర్ ఇండియాపై అసంతృప్తి :
వార్నర్కు ఎయిర్ ఇండియాతో ఇది కొత్త సమస్య కాదు. గత మార్చిలో బెంగళూరులో పైలట్లు లేక విమానం ఆలస్యమైందని X వేదికగా ప్రశ్నించాడు. వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రయాణం ఆలస్యం అయ్యిందని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలుపుతూ బదులు ఇచ్చింది. ప్రస్తుతం వార్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు విమాన భద్రతపై పెద్ద చర్చకు దారి తీశాయి.