బీహార్లో సంచలనం లేపుతున్న నకిలీ పోలీస్ స్టేషన్ ఉదంతం. ఏకంగా ఏడాది పాటు నడిచిన ఈ నకిలీ స్టేషన్ ప్రధాన సూత్రధారిగా రాహుల్ కుమార్ సాహ్ గా గుర్తించిన పోలీసులు. కుంభకోణం వెనుక ఉన్న నెట్వర్క్ తో పాటుగా ప్రధాన సూత్రధారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్న పోలీస్ యంత్రాంగం.
దేశంలోనే సంచలనం సృష్టించిన ఒక నకిలీ పోలీస్ స్టేషన్ ఉదంతం బీహార్లోని పూర్నియా జిల్లాలో వెలుగు చూసింది. మోహని గ్రామంలోని కస్బా పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు ఏడాది పాటు ఒక నకిలీ పోలీస్ స్టేషన్ యథేచ్ఛగా కొనసాగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణం వెనుక ప్రధాన సూత్రధారి రాహుల్ కుమార్ సాహ్ గా పోలీసులు నిర్ధారించారు. నిరుద్యోగ యువకులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.
మోసానికి తెరలేపిన వైనం…
పోలీసుల కథనం ప్రకారం, రాహుల్ కుమార్ సాహ్ ‘గ్రామీణ్ రక్షా దళ్’ పేరుతో ఉద్యోగాలంటూ ప్రచారం చేశాడు. కానిస్టేబుళ్లు, చౌకీదార్ల నియామకాల పేరుతో స్థానిక యువకుల నుంచి రూ. 2,500 నుంచి రూ. 5,000 వరకు వసూలు చేశాడు. చేర్చుకున్న తరువాత వారికి పోలీస్ యూనిఫామ్లు, లాఠీలు, నకిలీ గుర్తింపు కార్డులు ఇచ్చి, వాహనాల తనిఖీలు, మద్యం అక్రమ రవాణాపై దాడులు చేసే పనులను అప్పగించాడు.
నకిలీ పోలీసులు, నిజమైన వసూళ్లు….
బాధితులు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం, హెల్మెట్ ధరించకపోవడం లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వంటి ఉల్లంఘనలకు వాహనదారుల నుంచి రూ. 400 జరిమానా వసూలు చేయాలని రాహుల్ ఆదేశించినట్లు వివరించారు. అందులో రూ. 200 పెట్రోలింగ్ బృందానికి కమీషన్గా ఇవ్వాలని, మిగిలిన మొత్తాన్ని రాహుల్ తన జేబులో వేసుకునేవాడని బాధితులు తెలిపారు. “మిగిలిన డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళ్తుందని రాహుల్ చెప్పాడు” అని ఒక బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు.
నకిలీ పోలీస్ స్టేషన్ కార్యకలాపాలు….
మధ్య విద్యాలయ బెటౌనా ప్రాంగణంలో, మోహని పంచాయతీలో రాహుల్ సాహ్ ఈ నకిలీ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచే మద్యం స్మగ్లర్ల నుంచి అక్రమ వసూళ్లు, పట్టుబడిన వాహనాలను విడుదల చేయటానికి లంచాల తీసుకునేవాడని విచారణలో తేలింది. సీఎన్జీ ఆటోలను పెట్రోలింగ్ కోసం ఉపయోగించినట్లు, యూనిఫాంలో ఉన్న వ్యక్తులు వాటిని నడిపినట్లు సాక్షులు పోలీసులుకు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఆ వాహనాలను, ముఠాలోని ఇతర సభ్యులను గుర్తించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు…
అత్యంత ఆశ్చర్యకరంగా, ఈ మొత్తం వ్యవహారం నెలల తరబడి స్థానిక అధికారుల కంటపడలేదు. గ్రామ సర్పంచ్ (ముఖియా) శ్యామ్ సుందర్ ఒరాన్, అతని మేనల్లుడు సినోద్ ఒరాన్లకు ఈ ఆపరేషన్తో సంబంధం ఉందని ప్రజల నుంచి ఆరోపణలున్నాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నకిలీ కానిస్టేబుళ్లు, చౌకీదార్లను ఘనంగా సత్కరించినట్లు సమాచారం.నకిలీ పోలీస్ స్టేషన్ నిర్వహించిన కార్యక్రమాలకు అనేక మంది ప్రజాప్రతినిధులు హాజరైనట్లు సమాచారం. స్థానిక పరిపాలనా అధికారులు ఈ మోసంలో భాగస్వాములుగా ఉన్నట్లు గ్రామస్థులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
పూర్తిస్థాయి విచారణకు డిమాండ్…
బీహార్ మాజీ మంత్రి, కస్బా ఎమ్మెల్యే మొహమ్మద్ అఫాక్ ఆలం ఈ విషయంపై పూర్నియా ఎస్పీ కార్తికేయ కె. శర్మ పూర్తిస్థాయి విచారణకు డిమాండ్ చేశారు. ” రాష్ట్రంలో ఏడాదిగా ఇంత పెద్ద మోసం జరుగుతున్నా, పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. ఈ ప్రభుత్వం నిరుద్యోగాన్ని ప్రోత్సహిస్తోంది, ఇది విద్యావంతులైన యువకులను మోసగాళ్ల చేతుల్లోకి నెడుతోంది” అని ఆలం అన్నారు. ఇందులో అక్రమార్కుల ప్రమేయం ఉండవచ్చని సూచిస్తూ, ప్రత్యేక విచారణకు ఆయన పిలుపునిచ్చారు.
పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది…
ఇదిలావుండగా, కస్బా ఎస్.హెచ్.ఓ. అజయ్ కుమార్ అజ్నబీ, రాహుల్ కుమార్ సాహ్ మరియు అతని సహచరులపై కేసు నమోదు చేసినట్లు ధృవీకరించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పలు అనుమానిత స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయి. “రాహుల్ కుటుంబాన్ని రెండు రోజుల్లోగా అతన్ని పోలీస్ స్టేషన్లో హాజరుపరచాలని గడువు ఇచ్చాము, లేదంటే మేము వారి ఆస్తులను జప్తు చేసే ప్రక్రియను ప్రారంభిస్తాము” అని అజ్నబీ తెలిపారు. నకిలీ పోలీసుల కార్యకలాపాల వెనుక ఉన్న పెద్ద నెట్వర్క్ను గుర్తించడానికి, ప్రధాన సూత్రధారిని పట్టుకోవడానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.