Iran Israel War : ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అక్కడ నివసిస్తున్న భారత పౌరులు ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తూ, అప్రమత్తంగా ఉండాలని భారత ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించింది. మరోవైపు, ఈ పరిస్థితుల దృష్ట్యా ఇరాన్లోని జమ్మూ కశ్మీర్ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని జమ్మూ కశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (జేకేపీసీసీ) విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ను కోరింది.
ఇరాన్లోని భారత పౌరుల భద్రత కోసం, తెహ్రాన్లోని భారత ఎంబసీ ఆదివారం ఓ అడ్వైజరీ జారీ చేసింది. సోషల్ మీడియా ద్వారా టచ్లో ఉండాలని, షేర్ చేసిన గూగుల్ ఫామ్ను నింపాలని కోరింది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ల కోసం టెలిగ్రామ్ గ్రూప్లో చేరాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి ఫోన్ నంబర్లు, వాట్సాప్ నంబర్లను కూడా ఎంబసీ అందించింది.
విద్యార్థుల రక్షణపై కాంగ్రెస్ విజ్ఞప్తి : ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో, అక్కడ చదువుకుంటున్న వందలాది మంది కశ్మీరీ విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. జేకేపీసీసీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్ర, పీడీపీ నేత ఇల్తిజా ముఫ్తీ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని, భారత ఎంబసీని సంప్రదించాలని కోరారు. ముఖ్యంగా మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు ఎంబసీతో టచ్లో ఉండాలని, అవసరమైతే సోషల్ మీడియా ద్వారా సమస్యలను తెలియజేయాలని సూచించారు
శాంతిని పునరుద్ధరించాల్సిన నైతిక బాధ్యత : కాంగ్రెస్ పార్టీ ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఖండించింది, వీటివల్ల ప్రాణనష్టం జరిగిందని పేర్కొంది. ఇజ్రాయెల్ చర్యలు ఇరాన్ సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తున్నాయని, ఈ దాడులు కొనసాగితే పశ్చిమాసియాలో అస్థిరత పెరుగుతుందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భారత్ ఈ ఉద్రిక్తతలపై స్పష్టంగా స్పందించి, దౌత్య మార్గాల ద్వారా శాంతిని ప్రోత్సహించాలని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఇరాన్తో బలమైన సంబంధాలు, ఇజ్రాయెల్తో వ్యూహాత్మక బంధాలు ఉన్న భారత్కు శాంతిని పునరుద్ధరించాల్సిన నైతిక బాధ్యత ఉందని జైరాం రమేశ్ నొక్కి చెప్పారు.
ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ప్రకటన :ఇజ్రాయెల్ దాడులు ఆపితే, తామూ ప్రతిదాడులు నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి ప్రకటించారు. తెహ్రాన్లో దౌత్యవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా అమెరికాతో జరగాల్సిన అణు చర్చలను ఇరాన్ పక్కన పెట్టింది, దీనిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు.
ఉద్రిక్తతలు కారణం ఇజ్రాయెల్ : ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ, పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఇరాన్కు సంఘీభావం ప్రకటించారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడిన షరీఫ్, ఇజ్రాయెల్ రెచ్చగొట్టే చర్యలను ఆందోళన వ్యక్తం చేశారు. ఐరాస భద్రతా మండలిలో పాకిస్థాన్ మద్దతును గుర్తుచేయగా, పెజెష్కియాన్ కృతజ్ఞతలు తెలిపారు.