Voter Privacy is Key: పోలింగ్ బూత్ సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలన్న రాహుల్ గాంధీ డిమాండ్పై ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ప్రకటన చేసింది. ఓటర్ల గోప్యతను కాపాడడమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేస్తూ, ఫుటేజ్ విడుదల చేస్తే బెదిరింపుల ప్రమాదం ఉందని హెచ్చరించింది.
రాహుల్ గాంధీ ఆరోపణలు – ఈసీ స్పందన : గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో “ప్రమాద స్థాయిలో రిగ్గింగ్” జరిగిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు, పోలింగ్ బూత్ల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేయాలన్న ఆయన డిమాండ్పై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. జూన్ 30న ఈసీ విడుదల చేసిన ప్రకటనలో, సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేస్తే ఎవరు ఓటేశారో, ఎవరు వేయలేదో గుర్తించగలిగే పరిస్థితి ఏర్పడుతుందని స్పష్టం చేసింది. ఇది ఓటేయనివారిని లేదా ఇతరులను రాజకీయ పార్టీలు బెదిరించే, వేధించే అవకాశాన్ని కల్పిస్తుందని, తద్వారా ఓటర్ల గోప్యతకు భారీ ముప్పుగా మారగలదని ఆందోళన వ్యక్తం చేసింది.
ఎన్నికల పారదర్శకతపై రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం: ఈసీ తీరుపై తీవ్ర అసంతృప్తి : దేశంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఎక్స్ వేదికగా ఎన్నికల సంఘం (ఈసీ) తీరుపై ఆయన పదునైన ప్రశ్నల వర్షం కురిపించారు. ఈసీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రజల్లో అనుమానాలకు తావిస్తున్నాయని, ప్రజాస్వామ్య ప్రక్రియలో విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
రాహుల్ గాంధీ ప్రధాన అభ్యంతరాలు
ఓటర్ల జాబితా లభ్యత: ఓటరు జాబితాలను మెషీన్-రీడబుల్ ఫార్మాట్ (కంప్యూటర్లు సులభంగా చదవగలిగే ఫార్మాట్)లో ఇవ్వడం లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీనివల్ల సాధారణ పౌరులు, పార్టీల ప్రతినిధులు ఓటర్ల జాబితాలను నిశితంగా పరిశీలించడం, తప్పులు లేదా అక్రమాలను గుర్తించడం కష్టమవుతుంది. ఇది ఓటర్ల నమోదు ప్రక్రియలో పారదర్శకత లోపానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సీసీటీవీ ఫుటేజ్ గోప్యత: పోలింగ్ బూత్ల వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం లేదని, దీనికి అవసరమైన చట్టాలను ఈసీ మార్చిందని రాహుల్ ఆరోపించారు. పోలింగ్ రోజున ఏమి జరిగిందో తెలుసుకునే అవకాశం ప్రజలకు లేకుండా పోతుందని, ఇది ఎన్నికల అక్రమాలకు ఆస్కారం కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
డేటా నిల్వ పరిమితి: ఎన్నికలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వంటి కీలక డిజిటల్ ఆధారాలను కేవలం 45 రోజుల్లోనే తొలగించేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చారని రాహుల్ గాంధీ వెల్లడించారు. గతంలో ఈ సమాచారం ఏడాది వరకు అందుబాటులో ఉండేది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఏదైనా వివాదం తలెత్తితే, ఈ ఆధారాలు అవసరమవుతాయి. ఇలా కీలక సాక్ష్యాలను త్వరితగతిన తొలగించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆధారాల తొలగింపు ఆరోపణ: “సాక్ష్యం ఇవ్వాల్సినవాళ్లే సాక్ష్యం తుడిచేస్తున్నారు” అంటూ రాహుల్ గాంధీ పరోక్షంగా ఈసీ తీరును తప్పుబట్టారు. ఎన్నికల ప్రక్రియలో ఏమైనా లోపాలు లేదా అక్రమాలు జరిగితే, వాటికి సంబంధించిన కీలక ఆధారాలను ఎన్నికల సంఘమే తొలగిస్తోందని ఆయన సూచించారు. ఇది న్యాయమైన విచారణకు అడ్డంకిగా మారుతుందని ఆయన అభిప్రాయం.
ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను దెబ్బతీసి, ప్రజల్లో అనుమానాలకు తావిస్తున్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఈ అంశాలు రాబోయే కాలంలో ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చకు దారితీసే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వ సవరణ – 45 రోజుల పరిమితి
కేంద్ర ప్రభుత్వం 2023 డిసెంబరులో ఎన్నికల నియమావళి 1961లోని రూల్ 93ను సవరించిన విషయం తెలిసిందే. ఈ సవరణ ప్రకారం, సీసీటీవీ ఫుటేజ్, వెబ్కాస్టింగ్ వీడియోలు, అభ్యర్థుల ప్రచార సంబంధిత దృశ్యాలు వంటి డిజిటల్ డేటాకు ప్రజలకు అందుబాటు తగ్గింది. తాజా మార్పుతో, ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత 45 రోజుల లోపు మాత్రమే ఈ డేటాను నిల్వ చేయవచ్చు. ఈ వ్యవధి ముగిసిన తర్వాత వీటిని తొలగించబడుతుంది.
ఈసీ అభిప్రాయం – ఓటర్ల రక్షణే ముఖ్యం
ఈసీ వర్గాల వ్యాఖ్యల ప్రకారం, “ఈ డిమాండ్ ఓ సరైన భావనలా కనిపించినా, దీని వెనక అసలైన ఉద్దేశం ఓటర్లను బలహీనపరచడం. ఓటింగ్ జరిగిన రోజు ఫుటేజ్ విడుదల చేస్తే, ఓటర్లను గుర్తించి రాజకీయంగా వత్తిడికి గురిచేయవచ్చు. ఫలితంగా ఓటింగ్ నిష్పక్షపాతత, ప్రజాస్వామ్య విశ్వాసం దెబ్బతింటుంది” అని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన 45 రోజుల లోపు ఎన్నికపై పిటిషన్ దాఖలైతే, ఆ కేసుకు సంబంధించిన కోర్టు కోరితే మాత్రమే ఫుటేజ్ను ఈసీ ప్రామాణిక ఆధారంగా అందజేస్తుంది.