A leopard attack: కోయంబత్తూర్ జిల్లాలోని వాల్పరై, పచ్చైమలై ఎస్టేట్ సమీపంలో శనివారం జరిగిన హృదయ విదారక ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. చరుతపులి దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
బతుకుదెరువు కోసం వలస వచ్చి : జార్ఖండ్, అస్సాం, బీహార్, ఒడిశా వంటి రాష్ట్రాల నుండి బతుకుదెరువు కోసం వలస వచ్చి, పచ్చైమలైలోని తేయాకు తోటలలో పనిచేస్తూ అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
అలాంటి కుటుంబాల్లో ఒకటి జార్ఖండ్కు చెందిన మనోజ్ ముండా, మోనికా కుమారి దంపతులు. వారి ముద్దుల కుమార్తె, నాలుగేళ్ల రోషిణి, రోజులాగే ఆ ప్రాంతంలోని ఒక ఆలయం సమీపంలో ఆడుకుంటుంది. అదే సమయంలో, తేయాకు తోటలో మాటువేసిన ఒక చిరుతపులి మెరుపు వేగంతో దాడి చేసి, ఆ చిన్నారిని తన పదునైన పంజాలతో ఎత్తుకెళ్లింది. తమ కళ్లముందే తమ చిన్నారి అదృశ్యం కావడాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. వెంటనే స్థానికులు, అటవీ శాఖ అధికారులు సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్యలు చేపట్టారు.
హృదయ విదారక దృశ్యం : కొంత సమయం తరువాత, అటవీ ప్రాంతంలో లోపల రోషిణి మృతదేహం లభ్యమైంది. షాకింగ్గా, ఆ చిరుతపులి బాలికను పాక్షికంగా తినేసి, ఆపై శరీరాన్ని వదిలిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
నష్టపరిహారం, భద్రతపై డిమాండ్లు : ఈ విషాద ఘటన నేపథ్యంలో, తమిళనాడు ప్రభుత్వం బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.50,000 నష్టపరిహారం ప్రకటించింది. అయితే, ఈ మాత్రం సహాయం తమ బిడ్డను తిరిగి తీసుకురాలేదని ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ ఘటనతో పచ్చైమలై ఎస్టేట్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో చిరుతపులులు, పులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు వంటి వన్యప్రాణులు తరచుగా సంచరిస్తాయి. అటవీ శాఖ అధికారులు, వేట నిరోధక బృందాలు వన్యప్రాణులు నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా నిరోధించాలని, భవిష్యత్తులో ఇలాంటి ముప్పు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
దాడులు చేస్తున్న చిరుతపులిని పట్టుకోవడానికి అటవీ శాఖ తక్షణమే బోను వాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తమ భద్రతకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. పచ్చైమలైలో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే, అటవీ ప్రాంతాల్లోని ప్రజల భద్రతకు పటిష్టమైన ప్రణాళికలు అవసరమని స్థానికులు కోరుతున్నారు