36 Countries Travel Ban in US: అగ్రరాజ్యం అమెరికా 36 దేశాలపై ప్రయాణ ఆంక్షలను విధించేందుకు సిద్ధం అయ్యింది. ఈ అంశాన్ని ట్రంప్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం పరిశీలిస్తోందని క్లాసిఫైడ్ స్టేట్ డిపార్ట్మెంట్ కేబుల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే పలు దేశాలను ట్రంప్ ప్రభుత్వం రెడ్ లిస్ట్లో పెట్టింది. మళ్లీ కొత్తగా మరో 36 దేశాలపై ఆంక్షలకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అయితే ఈ ఆంక్షలు పాక్షికంగా ఉంటాయా లేక పూర్తిగా ప్రవేశ నిషేధాస్తారా అనే విషయంపై క్లారిటీ లేదు. ట్రంప్ రెడ్ లిస్ట్లో పెడుతున్న దేశాల్లో ఎక్కువగా ఆఫ్రికా మరియు కరేబియన్కి చెందిన దేశాలు ఉంటున్నాయి.
ఇదే విషయానికి బలం చేకూరుస్తూ విదేశాంగ మంత్రి మార్కో రుబియో సంతకాలు చేసినట్లు సమాచారం. ఎప్పుడైనా ఈ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ దేశంలోని అమెరికా దౌత్యవేత్తలకు ఈ విషయాన్ని చేరవేసినట్లు సమాచారం. ఈ కఠినమైన నిర్ణయం వెనక కారణాలు మాత్రం తెలియరాలేదు.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈజిప్టు, ఇథియోపియా, నైజీరియా, జిబౌటితో సహా ఆఫ్రికాలో మొత్తం ఇరవై ఐదు దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక కరేబియన్ దేశాల్లో ఆంటిగ్వా మరియు బార్బుడా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, డొమినికా మరియు సెయింట్ లూసియా పేర్లు ఉన్నట్లు సమాచారం. ఇవే కాకుండా భూటాన్, సిరియా, టోంగా, వనాటు దేశాలు కూడా ఈ లిస్ట్లో ఉన్నట్లు తెలుస్తోంది. పైన పేర్కొన్న దేశాలు 60 రోజుల్లోగా తగు ప్రమాణాలను చేరుకోకపోతే తక్షణమే వీటిపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
గెలిచినప్పటి నుంచి ట్రంప్ ఆ దేశంలోని కంపెనీలు, విద్యా సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నారు. కేవలం ఆ దేశ పౌరులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే ట్రంప్ తేల్చి చెప్పారు. లేని క్రమంలో ఆయా కంపెనీలు దేశాన్ని వీడి పోవాలని తేల్చి చెప్పారు. అయితే భారత్తో ఉన్న మైత్రితో ఇండియాపై ట్రంప్ ఎటువంటి ఆంక్షలు విధించలేదు. అయినా కానీ కొన్ని ప్రాంతాల్లో భారతీయులపై దాడులు జరుగుతున్నాయి. అయితే ఇరుదేశాల మధ్య ఉన్న మైత్రి కారణంగా వాణిజ్య, వ్యాపార కార్యకలపాలు సైతం సజావుగా సాగుతున్నాయి.