UN REPORT ON INDIAN POPULATION : భారతదేశం 2025 నాటికి 146 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతుందని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (UNFPA) తన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్’ (SOWP) నివేదికలో వెల్లడించింది. అయితే, ఈ గణాంకాలతో పాటు, దేశంలో సంతానోత్పత్తి రేటు (TFR) నిర్దేశిత స్థాయి కంటే దిగువకు పడిపోవడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జననాల రేటు 1.9గా ఉంది, ఇది ‘రీప్లేస్మెంట్ రేటు’ 2.1 కంటే తక్కువ. దీర్ఘకాలంలో దేశ జనాభా స్థిరంగా ఉండటానికి అవసరమైన పిల్లల సంఖ్య కంటే తక్కువగా జననాలు నమోదు అవుతున్నట్లు గుర్తించారు.
డెమోగ్రాఫిక్ నిపుణులు మిశ్రమ స్పందన :
ఈ పరిస్థితిపై డెమోగ్రాఫిక్ నిపుణులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు, జననాల రేటు తగ్గడం భవిష్యత్తులో జనాభా స్థిరీకరణకు దోహదపడుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సంతానోత్పత్తి రేటు తగ్గినా, భారతదేశంలో యువ జనాభా (15-64 ఏళ్ల వయస్సు వారు 68%) అధికంగా ఉండటం దేశానికి “డెమోగ్రాఫిక్ డివిడెండ్”ను అందిస్తుందని భావిస్తున్నారు. దేశంలో యువతకు సరైన ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ మద్దతు లభిస్తే, భారతదేశం ఆర్థికంగా గణనీయమైన ప్రగతిని సాధించగలదని నిపుణులు ఆశిస్తున్నారు.
భారతీయ మహిళల్లో పెరిగిన అవగాహన :
ఈ నివేదిక ప్రకారం, భారతీయ మహిళల్లో పెరిగిన అవగాహన, ప్రభుత్వ కార్యక్రమాల చొరవతోనే సంతానోత్పత్తి రేటు తగ్గిందని UNFPA భారత విభాగం ప్రతినిధి ఆండ్రియా ఎం వోజ్నర్ తెలిపారు. 1970లలో సగటున ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చిన భారతీయ మహిళలు ఇప్పుడు సగటున ఇద్దరు పిల్లలకే జన్మనిస్తున్నారు. ఇది సానుకూల మార్పు అయినప్పటికీ, రాష్ట్రాలు, కులాలు, ఆదాయ వర్గాల మధ్య ఇంకా అసమానతలు ఉన్నాయని వివరించారు. ప్రజలు తమ సంతానోత్పత్తి లక్ష్యాలను స్వేచ్ఛగా, బాధ్యతాయుతంగా నిర్ణయించుకునేలా ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని ఐరాస నివేదిక నొక్కి చెప్పింది. సంతానోత్పత్తి నిర్ణయాల్లో వ్యక్తిగత స్వేచ్ఛను అందించడం ద్వారా ఆర్థిక ఉన్నతి సాధించే అరుదైన అవకాశం భారతదేశానికి ఉందని నిపుణుల అభిప్రాయం వెళ్లిబుచ్చారు.