ఐపీఎలో మరో ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్ జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ను టైటిల్కు నడిపించిన శ్రేయస్ అయ్యర్, ఇప్పుడు పంజాబ్ కింగ్స్కు నాయకత్వం వహిస్తున్నాడు. గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టైటాన్స్తో పంజాబ్ కింగ్స్ తన తొలి మ్యాచ్లో తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
గత సీజన్ తర్వాత కోల్కతా ఫ్రాంచైజీ శ్రేయస్ అయ్యర్ను విడుదల చేయగా, పంజాబ్ కింగ్స్ అతన్ని వేలంలో రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభమన్ గిల్ వరుసగా రెండో సీజన్కి కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈసారి గుజరాత్ జట్టులో మార్పులు ఎక్కువగా చోటుచేసుకున్నాయి.
పంజాబ్ జట్టు ఓపెనింగ్ బాధ్యతలను ప్రభ్సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్కు అప్పగించే అవకాశం ఉంది. కోచ్ రికీ పాంటింగ్ ఇంగ్లిస్ను ఎక్కువగా నమ్ముతాడు కాబట్టి, అతను కీలక పాత్ర పోషించనున్నాడు. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా, మార్కస్ స్టొయినీస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, శశాంక్ సింగ్ ఉండనున్నారు. బౌలింగ్ విభాగంలో అర్ష్ దీప్ సింగ్, మార్కో జాన్సన్, యుజ్వేంద్ర చాహల్, హర్ప్రీత్ బ్రార్ ప్రధానంగా కనిపించనున్నారు.
గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే బ్యాటింగ్ లైనప్లో జోస్ బట్లర్, సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నారు. ఆల్రౌండర్లుగా రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్ జట్టులో భాగం కానున్నారు. బౌలింగ్ విభాగాన్ని రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ లాంటి బలమైన ఆటగాళ్లు నడిపించనున్నారు.
ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ ఆడుతుండటంతో, గెలుపు కోసం కసిగా బరిలోకి దిగుతాయి. పంజాబ్ కింగ్స్ కొత్త నాయకత్వంలో ఎలా రాణిస్తుందో, గుజరాత్ టైటాన్స్ కొత్త కూర్పుతో ఏ మేరకు విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.
ఇరు జట్లు ప్లేయింగ్-11 అంచనా-
పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టొయినీస్, గ్లెన్ మ్యాక్స్వెల్ , శశాంక్ సింగ్, నేహాల్ వధేరా, మార్కో జాన్సెన్, హర్ప్రీత్ బార్, అర్ష్ దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
గుజరాత్ టైటాన్స్ : శుభ్మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, సాయి కిషోర్, కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణ.