Gali Janardhan Reddy: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడు, కర్ణాటక మాజీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. రూ.10 లక్షల రెండు షూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దేశం విడిచి ఎక్కడికి వెళ్లిపోవడానికి వీలు లేదని.. పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. ఎలాంటి క్రిమినల్ చర్యల్లో పాల్గొనకూడదని సూచించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జనార్దన్రెడ్డితో పాటు ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాస్రెడ్డి, రాజగోపాల్కు బెయిల్ మంజూరు చేసింది.
కాగా గత 15 ఏళ్లుగా సాగుతున్న ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మే 5న గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది. ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. అప్పటి నుంచి ఆయన చంచల్ గూడ జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. ఈ తీర్పు నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి శాసనసభ్యత్వాన్ని కర్ణాటక శాసనసభ రద్దు చేసింది. ఇదే కేసులో అప్పటి గనుల శాఖ బాధ్యతలు చూసి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందాలను మాత్రం కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన జైలు శిక్షను సస్పెండ్ చేయాలని లేదంటే తన శాసనసభ సభ్యత్వం కోల్పోతానని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఇప్పటికే ఈ కేసులో మూడున్నర సంవత్సరాలు జైలు జీవితం గడిపానని వివరించారు. అయితే విచారణ సందర్భంగా గాలి జనార్థన్ రెడ్డి శిక్షను సస్పెండ్ చేయడాన్ని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. శిక్షను సస్పెండ్ చేసేందుకు ఎలాంటి అసాధారణ పరిస్థితులు లేవని వాదించింది. ఆయనపై ఇతర కేసులు కూడా నడుస్తున్నాయని తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు శిక్షను సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది. సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షపై స్టే విధించింది.