Sunday, September 29, 2024
HomeతెలంగాణKarimnagar: ఎల‌క్ట్రిక్ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సుల ప్రారంభం

Karimnagar: ఎల‌క్ట్రిక్ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సుల ప్రారంభం

ప్రారంభించిన మంత్రి పొన్నం..

కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కరీంనగర్-హైదరాబాద్ (జేబీఎస్) మార్గంలో తిరిగే 35 బస్సులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, కరీంనగర్ మేయర్ సునిల్ రావు, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి ఆయన కొత్త బస్సులో ప్రయాణించారు. బస్సులోనే కరీంనగర్-2 డిపోకు చేరుకొని అక్కడ ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఏర్పాటు చేసిన చార్జింగ్ స్టేషన్ ను పరిశీలించారు.

- Advertisement -

రాష్ట్రంలో తొలిసారి..

ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను కరీంనగర్ కు కేటాయించింనందుకు ఆర్టీసీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం 35 బస్సులు అందుబాటులోకి వచ్చాయని, త్వరలోనే మరో 39 ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తుందని తెలిపారు. కరీంనగర్ తో పాటు నిజామాబాద్ కు 67, వరంగల్ 86, సూర్యాపేటకు 52, నల్లగొండకు 65, హైదరాబాద్ కు 74 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

కాలుష్య రహిత సమాజం కోసం..

కాలుష్యరహిత సమాజం కోసం హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో దశలవారీగా 2400 బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ కసరత్తు చేస్తోందన్నారు. 

గ్రాంట్స్ ద్వారా కొత్త బస్సులు..

మహాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ల్ల బ‌స్సుల‌కు విప‌రీతంగా డిమాండ్ పెరిగింద‌ని అన్నారు. ర‌ద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వ గ్రాంట్స్ ద్వారా కొత్త బ‌స్సుల కొనుగోలుకు టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం ప్లాన్ చేస్తోంద‌ని చెప్పారు. కొత్త బ‌స్సులకు స‌రిప‌డా ఉద్యోగ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని, ఇప్ప‌టికే 3035 పోస్టుల నియామ‌క ప్ర‌కియ కొన‌సాగుతోంద‌ని తెలిపారు.

మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు.. 

మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ మేరకు మెప్మాతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. 2013 బాండ్లకు సంబంధించిన డబ్బును కండక్టర్లు, డ్రైవర్లకు సంస్థ చెల్లించిందని, మిగిలిన బకాయిలను దసరాలోగా మిగతా ఉద్యోగుల ఖాతాలో జమచేస్తామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తోందని స్పష్టం చేశారు. 

జిల్లాలో మరో 500 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..

టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. అత్యాధునిక హంగులతో అందుబాటులోకి తీసుకువస్తోన్న ఈ బస్సులు.. ప్ర‌యాణికుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణ అనుభూతిని కలిగిస్తాయని అన్నారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి జిల్లాల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు. రాబోయే కాలంలో హైదరాబాద్ తో సహా అన్ని జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను నడిపేలా యాజమాన్యం కసరత్తు చేస్తోందని చెప్పారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు నాన్ స్టాప్ గా నడుస్తాయని, తక్కువ సమయంలోనే కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు చేరుకోవచ్చని అన్నారు. ఈ బస్సులను త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేసిన జేబీఎం సంస్థను ఈ సందర్భంగా అభినందించారు. 

300 రోజుల్లో 92 కోట్ల జీరో టికెట్స్..

మహాల‌క్ష్మి ప‌థ‌కానికి మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. 300 రోజుల్లో మహిళలకు 92 కోట్ల జీరో టికెట్లను సంస్థ జారీ చేసిందని, ఫలితంగా రూ.3123 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని వెల్లడించారు. కరీంనగర్ రీజియన్ పరిధిలో 2.55 కోట్ల మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుని.. రూ.100 కోట్ల వరకు ఆదా చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, నిబద్దత, అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ ముని శేఖర్, సీఎంఈ వెంకన్న, కరీంనగర్ ఆర్ఎం సుచరిత, జేబీఎం ప్రతినిధి చందన్ మిశ్రా, తదితరులు పాల్గొన్నారు.

ఎలక్ట్రిక్‌ సూపర్ ల‌గ్జ‌రీ బస్సుల ప్రత్యేకతలివే

12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్‌ సూపర్ ల‌గ్జ‌రీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలను కల్పించారు. 41 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంది. బస్సులో లోపల 4 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంది.  బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా కూడా ఉంటుంది. గమ్యస్థానాల వివరాలు కోసం బస్సులో ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఫుల్ చార్జింగ్ కు రెండున్నర గంటల సమయం పడుతుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్‌ సదుపాయం ఈ బస్సుల్లో ఉంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News