Saturday, October 5, 2024
HomeతెలంగాణKaushik Reddy: కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా సర్కారీ బడుల్లో విద్యాబోధన

Kaushik Reddy: కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా సర్కారీ బడుల్లో విద్యాబోధన

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకే ‘మన ఊరు మనబడి ‘కార్యక్రమాన్ని చేపట్టారని, దీంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారుతున్నాయని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తూ డిజిటల్ విధానంలో విద్యాబోధన నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇల్లందకుంట మండలం మల్యాల, శ్రీరాములపల్లి, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన విద్యా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రభుత్వ బడి అంటే పేదవాడి బడి అనే నానుడి ఉండేదని కానీ నేటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ పాఠశాలలను కార్పరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతూ నాణ్యమైన విద్యను అందిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ పట్టుకుందన్నారు.

- Advertisement -


‘మన ఊరు మన బడి’ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల సుందరీకరణ, మరత్తులు, మౌలిక సదుపాయాలు కోసం ఇల్లందకుంట మండలంలో రూ,2 కోట్ల 96 లక్షలతో జమ్మికుంట మండలంలో రూ,3 కోట్ల 70 లక్షలతో పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1002 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ఆరు లక్షల మంది విద్యార్థులకు ఆయా గురుకులాల్లో విద్యను అందిస్తుండడం జరుగుతుందన్నారు. ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ,1.25 లక్షల ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. విద్యతోపాటు వైద్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తగు ప్రాధాన్యతనిస్తుందన్నారు. అందులో భాగంగానే హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్, హుజురాబాద్, జమ్మికుంటలో కోట్ల రూపాయలు వెచ్చించి కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. దీంతో నియోజకవర్గ పరిధిలోని పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. అనంతరం ఆయా పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నూతన యూనిఫాం, నోట్ బుక్కులను పంపిణీ చేశారు. అనంతరం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి మారుతి నగర్ లో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రైమరీ హెల్త్ సెంటర్లను ప్రారంభించారు. స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చెర్మైన్ తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు, ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి, కమిషనర్ శ్రీనివాస్, తాహసిల్దార్ రాజేశ్వరి, కౌన్సిలర్లు, సర్పంచ్ లు ఎంపీటీసీ సభ్యులు అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News