తెలంగాణలో చెరువులు ఎండిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
“నాడు- కాలువల నిండా నీళ్లతో ఏడాదికి రెండు పంటలు పండించు కునేందుకు అండగా కేసీఆర్ నిలిచారు. నేడు- ప్రాజెక్టులను పడావు బెట్టి, నీళ్లను ఆంధ్రాకు వదిలి పంటలను కాంగ్రెస్ ఎండబెడుతుంది. నాడు సమయానికి రైతుబంధుతో పాటు 24 గంటల ఉచిత కరెంట్, సాగునీళ్లు, విత్తనాలు, ఎరువులు, పంటల కొనుగోళ్లతో రైతు కంటినిండా నిద్ర, కడుపు నిండా సంతోషం ఉండేది.
కానీ 15 నెలల కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా రాదని, సాగునీళ్లు ఇవ్వరని, కరెంటు కొరత ఉందని.. విత్తనాలు దొరకవని, ఎరువులు ఉండవని, అన్ని గండాలు దాటుకుని పంటలు పండిస్తే కొనుగోళ్లు ఉండవు. కాంగ్రెస్ పాలనలో అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు అశ్వారావుపేట నుంచి జహీరాబాద్ వరకు వ్యవసాయం తిరోగమనంలోకి వెళ్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కరువును తెచ్చింది” అని కేటీఆర్ విమర్శించారు.