Sunday, October 6, 2024
HomeతెలంగాణAppeal: యాదాద్రి వరకు వేస్తున్న లోకల్ ట్రైన్ ని జనగామ వరకు పొడిగించండి

Appeal: యాదాద్రి వరకు వేస్తున్న లోకల్ ట్రైన్ ని జనగామ వరకు పొడిగించండి

యాదాద్రి వరకు వేస్తున్న లోకల్ ట్రైన్ ని జనగామ వరకు పొడిగించాలని, తదనుగుణంగా ఎంఎంటిఎస్‌ రైల్వే లైను, లోకల్‌ ట్రైన్‌ను మంజూరు చేయించాలని, ఈ మేరకు ఈ నెలలో తెలంగాణ పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్రమోడీకి చెప్పి ఒప్పించాలని కేంద్ర సాంస్క్రతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి రాష్ట్ర శాసన మండలిలో స్థానిక సంస్థల సభ్యుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లేఖ రాశారు. జనగామకు లోకల్ ట్రైన్ వేస్తే రైల్వేకు లాభం, ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

రాజధాని నగరం హైదరాబాద్ కి సమీపంలో వున్న జిల్లా కేంద్రాల్లో జనగామ ఒకటి. జనగామతోపాటు చుట్టు 50 నుంచి 60 కి.మీ. మేర పరిసర గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది హైదరాబాద్‌ వచ్చి వెళ్తుంటారు. జనగామ, ఆలేరు, భువనగిరి పట్టణాలతోపాటు, పెంబర్తి, వంగపల్లి, రాయగిరి, బీబీనగర్‌, ఘట్‌కేసర్‌ ల నుంచి కూడా ప్రజలు నిత్యం ఈ రూట్ లో రైలులో రాకపోకలు సాగిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం విద్యార్థులు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, హైదరాబాద్ లో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుని పొట్టపోసుకునేవారు, వ్యక్తిగత పనుల మీద, రోజు వారి కూలీలు, వివిధ షాపులలో పనిచేసేవారు, వ్యాపారపరంగా వెళ్లేవారు ఇలా వేలాది మంది నిత్యం  ట్రైన్లలో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ రూట్లల్లో ప్రస్తుతం నడుస్తున్న, అందుబాటులో ఉన్న అతి కొద్ది ట్రైన్లల్లోనే కిక్కిరిసి ప్రయాణాలు చేస్తున్నారు. కొన్నిసార్లు రైలు డబ్బాలకు వేలాడుతూ, అత్యంత ప్రమాదకర ప్రయాణాలకు తెగిస్తున్నారు. ఒకవైపు హైదరాబాద్ విశ్వనగరంగా విస్తరిస్తున్నది. మరోవైపు జిల్లా కేంద్రం అయిన తర్వాత జనగామ అటు వరంగల్, కాజీపేటలకు, ఇటు సికింద్రాబాద్, హైదరాబాద్ లకు వేగంగా విస్తరిస్తున్నది. మరికొద్ది ఏండ్లల్లోనే జనగామ అటు కాజీపేట, ఇటు హైదరాబాద్ లతో కలిసిపోయే అవకాశాలున్నాయి. ఈ దశలో హైదరాబాద్ నుండి జనగామకు లోక్ ట్రైన్ ను విస్తరిస్తే, ఆల్ రెడీ ఉన్న ట్రాక్స్ పైనే పెద్దగా ఖర్చు లేకుండానే నడపవచ్చు. తర్వాత తర్వాత ఇదే ట్రైన్ ను కాజీపేట, వరంగల్ వరకు విస్తరించవచ్చు. ఇవ్వాళ వేసే ఈ అడుగు ఎంతో ముందుచూపుతో వేసినట్లు అవడమేగాక, భవిష్యత్తు తరాలకు బాసటగా మారుతుంది. అటు రైల్వేకు లాభదాయకంగానూ, ఇటు ప్రయాణీకులకు సౌకర్యవంతంగానూ ఉంటుంది. ఈ రైల్వే రైట్లో లోకల్ ట్రైన్ వేస్తే, రోడ్లపై రద్దీ కూడా తగ్గి, ఈ రెండు దారుల్లో ప్రయాణాలు సులువవుతుంది. ఈ అంశాలను గమనించి, గుర్తించి తగు నిర్ణయం సానుకూలంగా తీసుకుంటారని ఆశిస్తున్నామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వారి ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విన్నవించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News