తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ(Weather Report) తెలిపింది. వాయువ్య ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల నుంచి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. ఉత్తర తమిళనాడు నుంచి దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ఇంటీరియర్ కర్నాటక మీదుగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది.
అలాగే వాయువ్య బంగాళాఖాతం, ఆనుకొని ఉన్న ఉత్తర తీర ఒడిశా, దక్షిణ గంగా తీర పశ్చిమ బెంగాల్ వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పుకొచ్చింది. ఈ ప్రభావం కారణంగా సోమవారం.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
ఇక మంగళవారం కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే, బుధ, గురు, శుక్రవారాల్లోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కొనసాగుతాయని వివరించింది. ఇక హైదరాబాద్ లోనూ వాతావరణం చల్లబడి వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది.