Monday, June 16, 2025
HomeతెలంగాణBandh in Telugu States: ఈనెల 20న తెలుగు రాష్ట్రాల్లో బంద్.. ఎందుకంటే..?

Bandh in Telugu States: ఈనెల 20న తెలుగు రాష్ట్రాల్లో బంద్.. ఎందుకంటే..?

Maoist Party Calls For Bandh in Telugu States: ఈనెల 20న తెలుగు రాష్ట్రాల్లో బంద్ కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఈమేరకు ఆ పార్టీ ప్రతినిధి జగన్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’కు నిరసనగా బంద్ చేపడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగా ‘ఆపరేషన్ కగార్‌’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపడుతోంది. ఈ ఆపరేషన్‌లో సీఆర్‌పీఎఫ్, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక బలగాలు, రాష్ట్ర పోలీసు దళాలు కలిసి సంయుక్తంగా పనిచేస్తాయి.

ఈ ఆపరేషన్‌లో భాగంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో చేపట్టిన ఎన్ కౌంటర్లలో ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. వీరిలో దశాబ్దాలుగా కీలక నాయకులుగా ఉన్న వారు కూడా ఉండటంతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు అనే వారే లేకుండా చేస్తామని ఇప్పటికే పలు మార్లు హెచ్చరించారు. అయితే కేంద్ర చర్యలను మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో శత్రు దేశమైన పాకిస్తాన్ పై చేపట్టిన దాడులను శాంతి చర్చల పేరుతో ఆపినప్పుడు.. మన దేశంలోని మావోయిస్టులను ఎందుకు శాంతి చర్చలు జరపరని వాదిస్తున్నాయి. అయితే కేంద్ర మాత్రం నక్సలైట్లతో చర్చలకు మాత్రం ముందుకు రావడం లేదు.

దీంతో ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు ఈనెల తెలంగాణతో పాటు ఏపీలో కూడా బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు ప్రజలు సహకారం అందించి విజయవంతం చేయాలని కోరుతూ మావోయిస్టు ప్రతినిధి జగన్ కోరారు. ఈమేరకు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో తమ డిమాండ్లతో పాటు ఆపరేషన్‌ కగార్ నిలిపివేయాలని, శాంతి చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు.

మావోయిస్టు నేతలు బంద్‌కు పిలుపునివ్వడంతో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంతో పాటు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. చెక్ పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. స్థానికుల రోజువారీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News