Friday, October 11, 2024
HomeతెలంగాణSirisilla: గీత కార్మికులను ఆదుకోవాలనే సోయి లేదా?

Sirisilla: గీత కార్మికులను ఆదుకోవాలనే సోయి లేదా?

తాడూరులో కాలిపోయిన తాటి చెట్ల పరిశీలన

రాష్ట్రవ్యాప్తంగా గీత కార్మికులు కష్టాలున్నారని, వారిని ఆదుకోవాలని సోయి కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని తాడూరు గ్రామంలో శుక్రవారం సుమారు 300 పైచిలుకు తాటి వనం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. బండి సంజయ్ కాలిపోయిన తాటి చెట్లను పరిశీలించారు. ఇక్కడున్న గీత కార్మికులు, స్థానికులతో మాట్లాడారు.

- Advertisement -

నష్టపోయిన గౌడన్నలను పరామర్శించారు. నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కొని ఈత మొక్కలను పెంచుతామని, ఈత మొక్కల పెంపకానికి, బిందు సేద్యానికి 90 శాతం సబ్సిడీ ఇస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. గౌడన్నల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెడతామని ఎన్నికల్లో ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందిని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటిన.. ఒక్కటంటే ఒక్క గ్రామంలోనైనా భూమిని కేటాయించారా అంటూ ఫైర్ అయ్యారు.

ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణాలపై 90 శాతం సబ్సిడీ ఇస్తామని ఒక్కరికైనా ఇచ్చారా అని అన్నారు. జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని హామీ ఇచ్చారు.?.. ఏమైంది? అధికారంలోకి వచ్చినంక అటకెక్కిస్తరు… ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడానికి నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. పైగా సర్వాయి పాపన్న గౌడన్నల ఆత్మగౌరవ ప్రతీక. మొగల్స్ ను గడగడలాడించి గొల్లకొండ కోటపై జెండాను రెపరెపలాడించి రాజ్యాన్ని పాలించినోడు… పార్టీలు, కులాలు, అతీతంగా జనగాం జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడితే హర్షిస్తారు.. మరి ఆ పని ఎందుకు చేయడం లేదని గుర్తుచేశారు.

గౌడన్నలు ప్రమాదవ శాత్తు చనిపోతే పైసలివ్వడం కాదు… బతికున్నప్పుడు ఉపాధి ఎందుకు కల్పించడంలేదన్నారు. తెల్లవారుజామున లేచి మోదు కట్టుకుని చెట్లు ఎక్కి కల్లు గీస్తుంటే… తాటి చెట్ల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి వేధిస్తే కల్లు తాగడానికి ఎవరొస్తారంటూ ఎద్దేవ చేశారు. మద్యం షాపులు దగ్గర కమీషన్లు సంపుకుంటర్రు.. కానీ, ఆరోగ్యకరమైన కల్లు తాగేటోళ్లను రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. గీత కార్మికుల సంక్షేమమంటే ఇదేనా..? ఇప్పటికైనా ప్రభుత్వం గీత కార్మికులను ఆదుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజక వర్గం ఇంచార్జి రాణి రుద్రమ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు, ఉపాధ్యక్షుడు ఇటుకల రాజు, ఎస్సై సెల్ సిలివేరి ప్రశాంత్, సీనియర్ నాయకులు గజాభింకార్ సంతోష్, కలికోట కాళీచరణ్, జిల్లా నాయకులు శీలం రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News