తెలంగాణలో నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన కొత్త మంత్రులకు(New Ministers) సచివాలయంలో ఛాంబర్లు కేటాయించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఫస్ట్ ఫ్లోర్ లో 13, 14, 15, 16 గదులు, మంత్రి వివేక్ వెంకటస్వామికి సెకండ్ ఫోర్ లో 20, 21, 22 నంబర్ రూంలు, మంత్రి వాకిటి శ్రీహరికి సెకండ్ ఫ్లోర్ లో 26, 27, 28 నంబర్ రూంలు కేటాయించారు. ఛాంబర్లు కేటాయించడంతో త్వరలోనే తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరించనున్నారు.
కాగా వివేక్ వెంకటస్వామికి కీలకమైన మైనింగ్, కార్మిక, ఉపాధి, జియాలజీ శాఖలు అప్పగించగా.. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, క్రీడలు, యువజన సేవల శాఖలు కేటాయించారు. ఇక అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ అభివృద్ధి, గిరిజన, మైనారిటీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఉండగా.. మూడు స్థానాలను భర్తీ చేశారు. మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు చోటు దక్కడం ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో విస్తృత ప్రచారం జరిగింది. కానీ హైకమాండ్ మాత్రం కేవలం బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రస్తుతానికి అవకాశం ఇచ్చింది. ఇక శాసనసభ ఉప సభాపతిగా రామచంద్రు నాయక్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
కేబినెట్లో మంత్రి పదవి దక్కిన నేతలు సంతోషంలో ఉండగా.. పదవి ఆశించి భంగపడ్డ నేతలు భంగపడ్డారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమకు కచ్చితంగా అవకాశం దక్కుతుందని భావించారు. చివరకు అనూహ్యంగా వారికి అధిష్టానం మొండిచేయి చూపడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలను పార్టీ పెద్దలు బుజ్జగించారు. దీంతో ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు.