Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్CM Jagan: వైసీపీలో 5.20 లక్షల కొత్త పదవులు.. ఈ మాస్టర్ ప్లానేంటి?

CM Jagan: వైసీపీలో 5.20 లక్షల కొత్త పదవులు.. ఈ మాస్టర్ ప్లానేంటి?

- Advertisement -

CM Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన వైసీపీ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీకి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అందులో ఒకటి 5.20 లక్షల మంది గృహ సారథుల నియమకం నిర్ణయం. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున 15 వేల గ్రామాల్లో 5.20 లక్షల మందిని పార్టీ తరఫున గృహ సారథులుగా నియమిస్తున్నామని చెప్పారు.

దీని ప్రకారం ప్రతి 50 ఇళ్లను క్లస్టర్‌ గా చేసుకుని, ఒక పురుషుడు, ఒక మహిళ చొప్పున ఇద్దరు గృహ సారథుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని, గృహ సారథులు కూడా అదే క్లస్టర్‌కు చెందిన వారై ఉండాలన్నారు. వీరే రేపు బూత్‌ కమిటీలలో సభ్యులుగా కూడా ఉంటారని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వీళ్ళు ఆ 50 ఇళ్ల ప‌రిధిలో కుటుంబాల‌ను త‌ర‌చుగా కలుస్తూ.. ప్రభుత్వ ప‌థ‌కాలు వ‌స్తున్నాయా? రావ‌ట్లేదా తెలుసుకొని.. నెల‌నెల ఎంత వస్తున్నాయి?.. ఏడాది గ్రాస్‌గా ఎంత మొత్తంగా వారు ఈ ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ధి పొందుతున్నారని లెక్కేలేసి వాళ్ళకి తెలియజెప్పాలి.

అయితే, ఇప్పటికే ఇదే పనికి వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా ఇప్పుడు జగన్ చెప్పిన పనినే అధికారికంగా వాలంటీర్లు చేస్తున్నారు. కానీ, మళ్ళీ ఇప్పుడు సారధులు పేరుతో మరో వ్యవస్థను సృష్టిస్తున్నారు. ఈసారి ఈ సారథులు పూర్తిగా పార్టీ పరం. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వైసీపీ ఈ ప్లాన్ వేసింది. ఈ సారథులతో కలిపి ఇప్పుడు ప్రజలపై మూడు స్థాయిలలో ప్రభుత్వం నిఘా ఉంటుంది.

ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఉన్నారు. వీళ్లు చేసేది అదే పని. దాదాపుగా వీళ్లంతా తమ పార్టీకి చెందిన వారేనని వైసీపీ పెద్దలే పలుమార్లు చెప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు మూడవస్థాయిలో సారథులను తీసుకొస్తున్నారు. అంటే ప్రజల చుట్టూ ప్రభుత్వం మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే.. ఇది ప్రజల సంక్షేమానికి మాత్రమే అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఇది రానున్న ఎన్నికల కోసం జగన్ మాస్టర్ ప్లాన్ అనే చెప్పుకోవాలి.

ఇప్పటికే ఏ ఎన్నికలలో కూడా సచివాలయ ఉద్యోగులను, గ్రామా వాలంటీర్లను ఎలాంటి విధులకు తీసుకొనే ఛాన్స్ లేదు. సో రేపు ఎన్నికలలో కూడా వీళ్ళు అటు వాలంటీర్లగా.. ఇటు పార్టీ కార్యకర్తలగా ఉపయోగపడరు. వీళ్ళ దగ్గర ప్రజల డేటా కూడా అప్పుడు ఈసీ ఉంచే పరిస్థితి ఉండదు. అందుకే ఇప్పుడు ఈ సారథులతో ఫక్తు రాజకీయ కోణంలో ప్రజలను పార్టీ వైపు తిప్పేందుకు ప్లాన్ వేసినట్లుగా చూడాలి. అయితే, ప్రజలు గెలిపించాలన్నా.. ఓడించాలన్నా ఒక్కసారి ఫిక్స్ అయితే.. కాపాడడం.. ఓడించడం ఏ వ్యవస్థ వల్ల కాదు. మరి వైసీపీ పెద్దలకు అది తెలియదో.. బహుశా తెలిసినా తమ ప్రయత్నం తాము చేయాలని ఫిక్స్ అయ్యారేమో!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News