ఏపీ ఫైబర్ నెట్(AP FiberNet)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సంస్థ అభివృద్ధికి సహకరించలేదంటూ ముగ్గురు ఉన్నతాధికారులపై సస్పెండ్ వేటు పడింది. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పూ భరద్వాజ, బిజినెస్ అండ్ ఆపరేషన్స్ హెడ్ గంధంశెట్టి సురేశ్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్ను తొలగిస్తున్నట్లు సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి(GV Reddy) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థలో 400 మందిని తొలగించాలని ఆదేశాలిచ్చినా పట్టించుకోలేదన్నారు. ఉద్యోగుల తొలగింపు ఆదేశాలపై ఫైబర్ నెట్ ఎండీ, ఈడీ సంతకాలు చేయలేదని మండిపడ్డారు.
ఉద్యోగులకు అక్రమంగా జీతాల రూపంలో సంస్థ సొమ్ము చెల్లించారన్నారు. ఫైబర్ నెట్కు జీఎస్టీ అధికారులు రూ.377 కోట్లు జరిమానా విధించిన విషయాన్ని తన దృష్టికి తీసుకురాలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఫైబర్ నెట్కు రూపాయి ఆదాయం తీసుకురాలేకపోయామన్నారు. అలాగే ఈ 8 నెలల్లో ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఫైబర్నెట్ ఎండీ దినేశ్కుమార్ నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పెద్దలతో కలిసి కూటమి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారా ? అని ప్రశ్నించారు. సంస్థ ఆదాయం పెంచేందుకు ఆయన ప్రయత్నించడం లేదని చెప్పారు. ఉన్నతాధికారులు రాజద్రోహం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.